తెలంగాణ

telangana

ETV Bharat / business

ముడి సరకు భారంతో మళ్లీ ధరల పెంపు? - ఎఫ్​ఎంసీజీ ఉత్పత్తుల ధరలు పెరిగేందుకు కారణాలు

దేశంలో ఇప్పటికే పెట్రోల్, నిత్యవసరాల ధరలు భగ్గుమంటున్నాయి. రానున్న రోజుల్లో ఈ భారం మరింత పెరగొచ్చని ఆంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎఫ్​ఎంసీజీ కంపెనీలు త్వరలో తమ ఉత్పత్తుల ధరలను పెంచే ఆవకాశం ఉందని పలు విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. ముడి సరకు ధరలు పెరగటమే ఇందుకు ప్రధాన కారణమనేది ఆయా విశ్లేషణల సారాంశం.

FMCG companies to rise prices
ఉత్పత్తుల ధరలు పెంచే యోచనలో ఎఫ్​ఎంసీజీ కంపెనీలు

By

Published : Jul 4, 2021, 10:25 AM IST

ముడి సరకు వ్యయాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎఫ్​ఎంసీజీ(వేగంగా అమ్ముడయ్యే వినియోగ ఉత్పత్తుల) కంపెనీలు అంచనా వేస్తున్నాయి. జూన్ త్రైమాసికంలో తమ నిర్వహణ మార్జిన్లపై కొవిడ్​-19 రెండో దశ ప్రభావం పడిందని చెబుతున్నాయి. ముడి సరకు వ్యయాల రూపంలో తమకు ఏప్రిల్​-జూన్​లో సవాళ్లు ఎదురుకావచ్చని జనవరి-మార్చి త్రైమాసికం ఫలితాల వెల్లడి సమయంలోనే ఏషియన్​ పెయింట్స్, బజాజ్​ కన్జూమర్​ కేర్​, డాబర్​, బ్రిటానియా ఇండస్ట్రీస్​, గోద్రేజ్ కన్జూమర్​ ప్రోడక్ట్స్​, హిందుస్థాన్​ యునిలీవర్, పిడిలైట్​ ఇండస్ట్రీస్​ సంస్థలు తెలిపాయి.

ఆయా సంస్థల ముడి సరకులు ఇవే..

వ్యవసాయ కమొడిటీలు, సుగంధ ద్రవ్యాలు, నూనెలు, ముడి చమురు ఆధారిత ఉత్పత్తులు వంటి వాటిని ఈ సంస్థలు ముడి సరకుగా వినియోగిస్తుంటాయి. జనవరి- మార్చిలో వినియోగ ఉత్పత్తుల రంగానికి చెందిన దిగ్గజ కంపెనీల నిర్వహణ మార్జిన్లు సాధారణ స్థాయిల కంటే తక్కువగా నమోదయ్యాయని బ్రోకరేజీ సంస్థ కోటక్​ ఇన్​స్ట్రిట్యూషనల్​ ఈక్విటీస్​ తెలిపింది. కొన్ని త్రైమాసికాలుగా ఎఫ్​ఎంసీజీ సంస్థలు ముడి సరకు వ్యయాల సమస్యను ఎదుర్కొంటున్నాయని, మున్ముందు కూడా స్థూల మార్జిన్లపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని జెఫ్రిస్​ విశ్లేషకులు అంచనా వేశారు. ముడి సరకు వ్యయాల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ఏప్రిల్​లో కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను 2-7శాతం పెంచాయి. మున్ముందు కూడా ధరలు మరింత పంచే అవకాశం ఉందననే సంకేతాలను కూడా ఇస్తున్నాయి. 2021-22 ద్వితీయార్ధంలో కమొడిటీ ధరలు కొంత కిందకు దిగిరావొచ్చని డాబర్​ ఇండియా అంచనా వేస్తోంది.

మూడేళ్ల తర్వాత తొలిసారి

ముడి సరకు వ్యయాల ప్రభావంతో దాదాపు మూడేళ్ల తర్వాత తొలిసారి పెయింట్​ కంపెనీలు ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్​ అంటోంది. ఎమల్షన్​లపై 3-4 శాతం, ఫుడ్​ కోటింగ్​లపై 6.9 శాతం మేర ధరలను ఈ కంపెనీలు పెంచాయని పేర్కొంది.

వాటర్​ ప్రూఫింగ్​ ఉత్పత్తులు, తక్కువ ధర ఎమల్షన్​లు, ప్రైమర్​ల ధరలను జులైలో పెంచేందుకు కంపెనీలు యోచన చేస్తున్నాయని.. ఈ పరిణామం అమ్మకాలపై ప్రభావం చూపించకపోవచ్చని బ్రోకరేజీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ముడి సరకు వ్యయాలు పెరగటం కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నప్పటికీ లాక్​డౌన్​ ఆంక్షల సడలింపుతో గిరాకీ పుంజుకుంటుంన్నందున మున్ముందు ఆ భారాన్ని పరిమితం చేసే అవకాశం ఉంటుంది అంటున్నాయి.

ఇదీ చదవండి:Petrol price: మళ్లీ పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలు

ABOUT THE AUTHOR

...view details