చిన్న మొత్తాల పొదుపు పథకాలు నెలవారీ ఆర్థిక క్రమశిక్షణను అలవడేలా చేస్తాయి. దీనితో పాటు వీటి వల్ల మరికొన్ని ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో వాయిదా పద్ధతిలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది కాబట్టి.. పొదుపు అనేది అలవాటు అవుతుంది. వీటిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి పొదుపు సురక్షితంగా ఉంటుంది. దీర్ఘకాలంలో పథకాలు కాంపౌండింగ్ ప్రభావంతో మంచి లాభాలను అందిస్తాయి. దీనిని రిటైర్మెంట్ ఫండ్గా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ ద్వారా పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
వివిధ రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలు ఏవి? వాటిలో కనీస పెట్టుబడి ఎంత? నిబంధనలు ఏమిటి? ఏవి ఎవరికి సరిపోతాయి అనే విషయాలను చూద్దాం.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్
ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్సే ఈ ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఇవి పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్లు.
ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.500 కాగా గరిష్ఠ పెట్టుబడికి పరిమితి లేదు. ఇవి 3 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్తో వస్తాయి. అంటే ఈ సమయంలో విక్రయించటానికి వీలు ఉండదు.
వీటిపై రాబడి మార్కెట్ గమనానికి అనుగుణంగా ఉంటుంది. చారిత్రాత్మకంగా చూసుకున్నట్లయితే వీటిపై వార్షికంగా 12శాతం నుంచి 15 శాతం రాబడి వచ్చినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఈ సేవింగ్స్ స్కీమ్ లో పెట్టుబడి మాత్రమే పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. మూలధన లాభాలకు పన్ను వర్తిస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన
ఇది కేంద్ర ప్రభుత్వ పథకమైన భేటీ బచావో, భేటీ పడావోలో భాగంగా తీసుకొచ్చిన పథకం ఇది. దీనిని 2015లో ప్రారంభించారు. ఇది ఆడపిల్లలకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్. 2022 ఆర్థిక సంవత్సరానికి దీనిపై వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ సేవింగ్స్ పథకం. రాబడిపై గ్యారంటీ ఉంటుంది.
ఆడపిల్ల వయస్సు 0-10 మధ్య ఉన్నప్పుడు ఆమె పేరు మీద తల్లిదండ్రులు ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఒక కుటుంబానికి రెండు ఖాతాలు మాత్రమే తెరవవచ్చు. 15 సంవత్సరాలు వచ్చే వరకు పెట్టుబడి కొనసాగించవచ్చు. 18 ఏళ్ల వయస్సులో కూతురు ఈ ఖాతాను తనపేరు మీదికి మార్చుకోవచ్చు. ఉన్నత విద్యకు సంబంధించి 18 ఏళ్ల వయస్సులో 50 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. 21 సంవత్సరాలకు ఈ స్కీమ్ మెచ్యురిటీ ఉంటుంది.
దీనికి పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి. పెట్టుబడితో పాటు రిటర్న్లకు కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. ఖాతాదారు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నా లేక తక్కువ వయస్సులోనే మరణించినా.. మెచ్యూరిటీ కంటే ముందే పెట్టుబడిని తీసుకోవచ్చు. ఇతర సందర్భాల్లో ప్రీ మెచ్యురిటీ విత్ డ్రా అనేది ఉండదు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)
ఇదొక పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్. నేషనల్ సేవింగ్స్ ఇనిస్టిట్యూట్ 1968లో దీనిని ప్రారంభించింది. పన్ను ప్రయోజనాలకు సంబంధించి చాలా పాపులర్ సాధనం ఇది. ఇందులో వార్షిక కనీస పెట్టుబడి రూ.500 కాగా.. గరిష్ఠ పెట్టుబడి రూ.1,50,000. ప్రస్తుతం దీనిపై వడ్డీ రేటు 7.1 శాతం కాగా వార్షికంగా కాంపౌండ్ అవుతుంది.
పెట్టుబడిదారులు ఒకటే ఖాతాను ప్రారంభించుకోవచ్చు. నెలసరి వాయిదా పద్ధతిలో లేక ఒకేసారి ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. దీనిని ఒక పోస్టాఫీసు నుంచి మరో పోస్టాఫీసుకు బదిలీ చేసుకోవచ్చు. 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. పెట్టుబడిని మరో 5 సంవత్సరాలు పొడగించుకోవచ్చు.
80సీ ప్రకారం రూ.1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. వడ్డీ ఆదాయంతో పాటు పెట్టుబడి మొత్తానికి పన్ను మినహాయింపు ఉంటుంది.
అటల్ పెన్షన్ యోజన
అసంఘటిత రంగంలో ఉన్న వారికి సామాజిక భద్రత పథకం ఇది. ఈ పథకంలో పింఛను మొత్తాన్ని నిర్ణయించుకుని దానికి అనుగుణంగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. రూ.1000 నుంచి రూ.5000 వరకు నెలవారీ పింఛన్ను ఎంపిక చేసుకోవచ్చు.
18 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరవచ్చు. గరిష్ఠ ప్రవేశ వయస్సు 40 ఏళ్లు. 60 ఏళ్ల వరకు ఇందులో మదింపు చేయాల్సి ఉంటుంది. నెలకు ఎంత మదింపు చేయాలన్నది వయస్సు, ఎంచుకున్న పింఛన్ ఆధారంగా నిర్ణయం అవుతుంది.
చిన్న వయస్సులో ఈ పథకంలో చేరితే తక్కువ మొత్తం నెలవారీ పెట్టుబడి ఉంటుంది. పొందాలనుకునే పింఛన్ మొత్తాన్ని తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. అయితే సంవత్సరానికి ఓ సారి ఏప్రిల్లో మాత్రమే చేసుకోవాలి. ఈఎంఐ చెల్లించకుంటే ఆరు నెలల వరకు ఖాతా పని చేయదు. 12 నెలల తర్వాత ఖాతా డియాక్టివేట్ అవుతుంది. 24 నెలల అనంతరం ఖాతాను మూసివేస్తారు.
ఆదాయపు పన్ను చట్టం 80సీసీడీ(1) ప్రకారం రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీసీడీ(1బీ) ప్రకారం అదనంగా రూ.50వేల వరకు మరింత మినహాయింపు తీసుకోవచ్చు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్సీ)
చిన్న మొత్తాల పొదుపును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఇది. దీనిని ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి రాబడికి గ్యారంటీ ఉంటుంది. ప్రస్తుతం దీనిపై వడ్డీ రేటు 6.8 శాతం ఉంది. వార్షికంగా వడ్డీ అసలుతో జమ(కాంపౌండింగ్) అవుతుంది.