ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 140కి పైగా దేశాల్లో వ్యాపించింది. వైరస్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక రంగానికి చేయూత అందించే దిశగా దేశాల కేంద్ర బ్యాంకులు కీలక వడ్డీ రేట్లతో కోతకు మొగ్గు చూపుతున్నాయి. తాజాగా 0.25 శాతం మేర కీలక వడ్డీ రేట్లలో కోత విధించింది అమెరికా కేంద్ర బ్యాంకు 'ఫెడరల్ రిజర్వ్'. గత రెండు వారాల్లో 'ఫెడ్' వడ్డీ రేట్లను తగ్గించడం ఇది రెండోసారి.
ఆర్థిక లావాదేవీలు పెంచేందుకే..
లావాదేవీలు పెంచి ఆర్థిక రంగానికి ఊతం అందించేందుకే ఫెడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తక్కువ వడ్డీరేట్లతో వ్యాపారాలు, వ్యక్తిగత రుణాలు అందించాలని, ఆస్తుల కొనుగోలు దిశగా వినియోగదారులను ప్రోత్సహించాలని తాజా ప్రకటనలో బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది ఫెడ్. అదే సమయంలో బ్యాంకుల వద్ద ఉండాల్సిన నగదు డిపాజిట్ల శాతాన్ని తగ్గించి మార్కెట్లోకి నగదు ప్రవాహం పెంచేందుకు నిర్ణయం తీసుకుంది.
ఫెడ్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
"ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయం అసాధారణం. ఈ నిర్ణయం పట్ల సంతోషంగా ఉంది. ఎవరూ ఊహించని విధంగా ఫెడ్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యపరిచింది."