కరోనా విజృంభణ నేపథ్యంలో దక్షిణాసియా దేశాలు 40 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఘోర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని ఇటీవల ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఒకవైపు ఆరోగ్య అత్యవసర పరిస్థితి సవాళ్లను ఎదుర్కొంటూనే వారి ప్రజలను కాపాడుకోవాలని సూచించింది. ముఖ్యంగా పేదలపై దృష్టి పెట్టి ఆర్థికంగా కోలుకునేందుకు ప్రయత్నించాలని వివరించింది.
ప్రపంచ బ్యాంకు హెచ్చరిక నేపథ్యంలో కరోనా సంక్షోభంతో కుదేలయిన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు సార్క్ దేశాలు చర్యలు చేపట్టాయి. పెట్టుబడులకు ఊతమిచ్చేలా, ప్రైవేటు వ్యాపారాలు కోలుకునేందుకు ఉపశమన ప్యాకేజీలను రూపొందించాయి.
భారత్లో..
2.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో సార్క్ దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న భారత్.. ఇప్పటికే 1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. వృద్ధులు, మహిళలకు ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు ఆహారం, వంట గ్యాస్ ఉచితంగా అందిస్తోంది.
రుణాలపై వడ్డీరేటును 75 బేసిస్ పాయింట్లు తగ్గించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.. లక్ష కోట్ల నగదును విపణిలోకి చొప్పించింది. రుణాల చెల్లింపుపై 3 నెలల పాటు మారటోరియం విధించేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది.
అంతేకాకుండా.. దివాలా చట్టాన్ని 6 నుంచి 12 నెలల వరకు రద్దు చేసింది. దీనివల్ల కంపెనీల ఆర్థిక వ్యవహారాలు, రుణాలు చెల్లింపులకు ఊరట కల్పించింది.
పాకిస్థాన్లో..
దాయాది దేశం పాకిస్థాన్లో కేసులు విజృంభిస్తోన్న నేపథ్యంలో గత నెలలో లాక్డౌన్ విధించారు ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. దీనిపై తొలుత ప్రైవేట్ రంగ సంస్థలు స్వల్పంగా వ్యతిరేకించాయి. క్రమంగా చిన్న వ్యాపారాలు, దుకాణదారుల్లో అశాంతి నెమ్మదిగా పుట్టుకొచ్చింది. దీర్ఘకాలిక మూసివేతను కొనసాగించలేమని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో వ్యాపారాలు, పేదల కోసం 1.2 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది పాక్ ప్రభుత్వం. చిన్న, మధ్య తరహా సంస్థలకు రూ.7,500 కోట్లను కేటాయించింది. వివిధ రంగాల్లోని వ్యాపారవేత్తలు కట్టిన పన్నుల మొత్తం రూ.20 వేల కోట్లు తిరిగి ఇచ్చినట్లు ఇమ్రాన్ఖాన్ వెల్లడించారు.
పాకిస్థాన్ కేంద్ర బ్యాంకు నిర్ణయాలు కూడా పలు నిర్ణయాలను ప్రకటించింది. వడ్డీ రేట్లను 13.25 నుంచి 9 శాతానికి తగ్గించింది. వ్యాపారాలకు రాయితీలను 4 నుంచి 5 శాతానికి పెంచింది.
బంగ్లాదేశ్..
మరో పొరుగు దేశం బంగ్లాదేశ్ కూడా 11.6 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. తయారీ, సేవల రంగం, వ్యవసాయం, సామాజిక భద్రత లక్ష్యాలుగా ఈ ప్యాకేజీని రూపొందించింది. ఈ ప్యాకేజీ విలువ ఆ దేశ జీడీపీలో 3.5 శాతమని బంగ్లా ప్రధాని షేక్ హసీనా తెలిపారు.
బంగ్లాదేశ్లో ప్రధాన విదేశీ మారకాన్ని ఆర్జించేది వస్త్ర పరిశ్రమ. దీనిపై 45 లక్షల మంది ఆధారపడ్డారు. 3.2 బిలియన్ డాలర్ల ఆర్డర్లు రద్దయిన కారణంగా 23 లక్షల మందిపై ఆ ప్రభావం పడినట్లు బంగ్లా గార్మెంట్స్ తయారీ, ఎగుమతిదారుల సంఘం తెలిపింది.