గత వారం రాజకీయ కారణాల వల్ల స్వల్ప ఆటుపోట్లకు లోనయ్యాయి స్టాక్ మార్కెట్లు. అయితే ఈ వారం రెపో రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో మార్కెట్లను ఎటువైపు నడిపిస్తాయన్న అంశంపై నిపుణుల విశ్లేషణలు మీకోసం.
దేశీయ కారణాలు
ఇటీవల ప్రకటించిన 2018-19 చివరి త్రైమాసిక గణాంకాల్లో ఆర్థిక వృద్ధి ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. వ్యవసాయ రంగం, తయారీ రంగాలు నెమ్మదించాయి. ఈ కారణాలతో 2018-19 చివరి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి 5.8 శాతంగా నమోదైంది.
గత వారం చివరి సెషన్ ముగిసిన తర్వాత ఈ గణాంకాలు వెలువడిన కారణంగా మార్కెట్లపై పెద్దగా ప్రభావం పడలేదు. అయితే ఈ వారం తొలి సెషన్లో మాత్రం ఈ గణాంకాల ప్రభావం ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఫలితంగా స్వల్ప ఆటుపోట్లు ఎదురయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. అయితే వృద్ధికి ఊతమందించే దిశగా ఆర్బీఐ రెపో రేటు నిర్ణయం ఉండొచ్చనే అంచనాలు మార్కెట్లకు సానుకూల అంశంగా మారొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6న రెపో రేట్లపై నిర్ణయాన్ని ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష ప్రకటించనుంది.
"ఆర్థిక మంత్రిగా ఇప్పుడు నిర్మలా సీతారామన్ బాధ్యతలు చేపట్టారు. ఆమెపై చాలా ఆశలున్నాయి. నిధుల సమస్య ఉంది. బ్యాంకుల రీక్యాపిటలైజేషన్, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ప్రధాన సవాళ్లు. " - ముస్తాఫ నదీమ్, ఎపిక్ రీసర్చ్ సీఈఓ.