తెలంగాణ

telangana

By

Published : Aug 25, 2020, 6:28 PM IST

ETV Bharat / business

'భారీ సంస్కరణలతోనే ఆర్థిక రికవరీ సాధ్యం'

కరోనా నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలన్నా, సుస్థిర వృద్ధి సాధించాలన్నా భారీ ఎత్తున సంస్కరణలు తప్పనిసరి అని మరోసారి స్పష్టం చేసింది ఆర్​బీఐ. కొవిడ్ భయాలు తొలిగే వరకు ఆర్థిక వృద్ధి మందగమనంగానే ఉంటుందని వెల్లడించింది. ఇటీవల ఆర్థిక వృద్ధి కాస్త పుంజుకున్నట్లు కనిపించినా.. రాష్ట్రాల్లో లాక్​డౌన్ కారణంగా మళ్లీ తగ్గినట్లు తెలిపింది. ఇది గతంలో ఎన్నడూ చూడని సంక్షోభమని వార్షిక నివేదికలో పేర్కొంది.

rbi about post corona impact on economy
భారీ సంస్కరణలతోనే వృద్ధి సాధ్యం

కరోనా తర్వాత జాతీయ ఉత్పాదకతలో భారీ తగ్గుదల నమోదయ్యే ప్రమాదం ఉందని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్​బీఐ) హెచ్చరించింది. కరోనా నష్టాల నుంచి బయటపడేందుకు, సుస్థిరమైన ఆర్థికవృద్ధి తిరిగి సాధించేందుకు విస్తృత స్థాయిలో సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరముందని మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా.. కరోనా తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపనుందని ఆర్​బీఐ అంచనా వేసింది. వైరస్‌ తీవ్రత, వ్యాప్తి, కాలవ్యవధి, వ్యాక్సిన్‌ తయారీ వంటి అంశాలపై ఈ నష్టం ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది. వీటి ఆధారంగా చూస్తే కరోనా నుంచి కొలుకునేందుకు ఆర్థిక వ్యవస్థకు ఇంకా చాలా సమయం పట్టొచ్చని వివరించింది. కొవిడ్​ కారణంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక కార్యకలాపాలు తగ్గినట్లు పేర్కొంది.

కరోనా తర్వాత ప్రపంచం మునుపటిలా ఉండదని పేర్కొన్న ఆర్​బీఐ... సరికొత్త సాధారణ పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది.

లాక్​డౌన్​తో జాప్యం..

రాష్ట్రాల్లో స్థానికంగా విధించే లాక్‌డౌన్‌ల కారణంగా ఆర్థిక పునరుద్ధరణ జాప్యమవుతున్నట్లు ఆర్​బీఐ తెలిపింది.

దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ సడలింపుల తర్వాత.. మే, జూన్‌ నెలల్లో ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కనిపించిందని ఆర్​బీఐ నివేదిక తెలిపింది. అయితే జులై, ఆగస్టులో ఈ వృద్ధి తగ్గిపోయినట్లు గుర్తించింది. రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్‌ కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు వెల్లడించింది.

ద్రవ్యలోటు..

2020-21లో ద్రవ్య లోటు జీడీపీలో 5.8 శాతానికి, నికర రుణాలు 70.5 శాతానికి పెరుగుతాయని ఆర్​బీఐ అంచనా వేసింది.

కరోనా కారణంగా బడ్జెట్​లో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో మరిన్న సవాళ్లు ఎదురవ్వనున్నట్ల తెలిపింది రిజర్వు బ్యాంకు.

ప్రస్తుతం ఉద్దీపనలు ఇవ్వడం సహా.. కరోనా నుంచి కొలుకుంటున్న సమయంలో వాటిని విరమించుకునేందుకు కూడా సరైన ప్రణాళిక ఎంతైనా అవసరమని స్పష్టం చేసింది.

ద్రవ్యోల్బణం..

ఇప్పటికే అంచనాలను మించి పెరిగిన ద్రవ్యోల్బణం రానున్న నెలల్లో మరింతపైకి చేరొచ్చని ఆర్​బీఐ నివేదిక తెలిపింది. ఆహార, తయారీ వస్తువుల సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఇందుకు కారణంగా చెప్పుకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ధరల నియంత్రణ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఆర్​బీఐ గుర్తు చేసింది.

ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం.. జులైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.93 శాతంగా ఉంది. ముఖ్యంగా ఆహార ఉత్పత్తుల ధరల్లో వృద్ధే ద్రవ్యోల్బణం పెరిగేందుకు ప్రధాన కారణం.

ఇదీ చూడండి:'అవును.. రూ.2 వేల నోట్ల ముద్రణ ఆపేశాం'

ABOUT THE AUTHOR

...view details