బంగారం కొనుగోలు అంటే ఒకప్పుడు భౌతికంగా కొనుగోలు చేయటం మాత్రమే ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారింది. డిజిటల్గా బంగారం కొనుగోలు చేసేందుకు పలు రకాల సదుపాయాలు ఉన్నాయి. గోల్డ్ ఈటీఎఫ్లు, ఎస్జీబీలు ఈ కోవలోకే వస్తాయి. ఇటీవలి కాలంలో ఇలా డిజిటల్ రూపంలో గోల్డ్ కొనుగోళ్లకు డిమాండ్ పెరుగుతోంది. 2020-21లో 46 టన్నుల గోల్డ్ను ఇలా కొనుగోలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు వీటి డిమాండ్ ఎంతలా ఉందో. భవిష్యత్లోనూ ఈ డిమాండ్ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఉత్తమ పెట్టుబడి మార్గాలు..
ఈటీఎఫ్ అంటే ఎక్ఛేంజీ ట్రేడెడ్ ఫండ్. అదే బంగారం ఆధారంగా ఉంటే అది గోల్డ్ ఈటీఎఫ్. ఎస్జీబీ అంటే గోల్డ్ సావరిన్ బాండ్లు. వీటిని ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది. తరుగు వంటి సమస్యలు లేకుండా సురక్షితంగా, సులభంగా పెట్టుబడి పెట్టేందుకు వీలున్నందున.. పసిడిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ రెండూ ఉత్తమమైన మార్గాలని నిపుణులు చెబుతుంటారు.
ఎస్జీబీ ఆర్బీఐ ద్వారా 2020-21లో రూ.16,049 కోట్ల నిధులను సమీకరించింది. అంటే 32.4 టన్నులకు సమానమైన ఎస్జీబీలను పెట్టుబడిదారులు కొనుగోలు చేశారు. తదుపరి ఎస్జీబీలు రాబోయే ఆర్థిక సంవత్సరంలో సబ్ స్క్రిప్షన్కు అందుబాటులో ఉండనున్నాయి.
ఈటీఎఫ్లలో పెట్టుబడితో ప్రయోజనాలు...
ఈ ఈటీఎఫ్లను ఖచ్చితమైన ధరలకు కొనుగోలు చేయొచ్చు. అదనపు ఛార్జీలు ఉండవు. గోల్డ్ ఈటీఎఫ్లలో తక్కువ డబ్బుతో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. మనకు కావాల్సినప్పుడు వీటిని అమ్మి డబ్బులు పొందవచ్చు. అంతేకాకుండా భౌతికంగా బంగారానికి కావాల్సిన లాకర్ లాంటివి దీనికి అవసరం లేదు.
సాధారణంగా స్టాక్ మార్కెట్లలో లాభాలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి. ఇవి గోల్డ్ ఈటీఎఫ్లకు కూడా వర్తిస్తాయి.
పెరిగిన పెట్టుబడులు..
గోల్డ్ ఈటీఎఫ్లతో కలిపి.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 46 టన్నుల మేర పేపర్ బంగారం (బాండ్లు, ఎక్ఛేంజ్ రూపంలో) కొనుగోళ్లు జరిగాయి. భౌతికంగా కూడా పెట్టుబడులు భారీగానే వచ్చినట్ల గణాంకాలు చెబుతున్నాయి.