తెలంగాణ

telangana

పసిడి డిమాండ్ భారత్​లో భళా.. అంతర్జాతీయంగా డీలా!

By

Published : Apr 29, 2021, 1:58 PM IST

భారత్​లో పసిడి డిమాండ్ ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 37 శాతం పెరిగి.. 140 టన్నులకు చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదికలో తేలింది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా మాత్రం బంగారం డిమాండ్ 23 శాతం క్షీణించినట్లు వెల్లడైంది. నివేదిక ద్వారా తెలిసిన మరిన్ని కీలక విషయాలు ఇలా ఉన్నాయి.

gold demand bounces back in India
భారత్​లో పెరిగిన బంగారం డిమాండ్

దేశీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య పసిడి డిమాండ్ 140 టన్నులకు పెరిగినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ)​ నివేదిక వెల్లడించింది. 2020 ఇదే సమయంతో(102 టన్నులు) పోలిస్తే పసిడి ఈ డిమాండ్ 37 శాతం పుంజుకున్నట్లు తెలిపింది. కరోనా ఆంక్షల సడలింపు, గత ఏడాదితో పోలిస్తే ధరలు దిగిరావడం వంటివి డిమాండ్ పెరిగేందుకు కారణమైనట్లు డబ్ల్యూజీసీ వెల్లడించింది.

విలువ పరంగా చూస్తే పసిడి డిమాండ్ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఏకంగా 57 శాతం పెరిగి.. రూ.58,800 కోట్లకు చేరినట్లు డబ్ల్యూజీసీ వివరించింది. 2020 క్యూ1లో ఇది రూ.37,580 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.

డబ్ల్యూజీసీ నివేదికలోని మరిన్ని వివరాలు..

  • బంగారు ఆభరణాల డిమాండ్ ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 102.5 టన్నులకు పెరిగింది (రూ.43,100 కోట్లు). 2020లో ఇది 73.9 (రూ.27,230) టన్నులుగా ఉంది.
  • పసిడిపై పెట్టుబడులు కూడా 2021 క్యూ1లో 37.5 టన్నులకు పెరిగాయి. 2020 క్యూ1లో పసిడిపై పెట్టుబడులు 28.1 టన్నులుగా ఉన్నాయి. 2021 జనవరి మార్చి మధ్య మొత్తం రూ.15,780 కోట్లు పసిడిపై పెట్టుబడిగా పెట్టారు మదుపరులు. గత ఏడాది ఇదే సమయంలో రూ.10,350 కోట్లు పెట్టుబడిగా పెట్టారు.
  • బంగారం రీసైకిల్ మాత్రం ఈ ఏడాది తొలి మూడు నెలల్లో (2020తో పోలిస్తే) 20 శాతం తగ్గింది. 14.8 టన్నుల పసిడి మాత్రమే రీసైకిల్ అయ్యింది.

అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ ఇలా..

ప్రపంచవ్యాప్తంగా పసిడి డిమాండ్​ ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య 23 శాతం తగ్గి.. 815.7 టన్నులకు చేరింది. 2020 ఇదే సమయంలో పసిడి డిమాండ్ 1,059.9 టన్నులుగా నమోదైనట్లు డబ్ల్యూజీసీ పేర్కొంది. గోల్డ్ ఈటీఎఫ్​ల ఔట్ ప్లో పెరగటం, కేంద్ర బ్యాంకుల నుంచి కొనుగోళ్లు తగ్గటం ఇందుకు కారణంగా వివరించింది.

  • పసిడిపై పెట్టుబడులు 2021 క్యూ1లో ఏకంగా 71 క్షీణించి.. 161.6 టన్నులుగా నమోదైనట్లు తెలిపింది డబ్ల్యూజీసీ. గత ఏడాది ఇదే సమయంలో ఈ పరిమాణం 549.6 టన్నులుగా ఉంది.
  • గోల్డ్​ బార్లు, కాయిన్లపై మాత్రం పెట్టుబడులు 36 శాతం (339.5 టన్నులకు) పెరిగాయి.
  • 2020 చివరి త్రైమాసికంతో పోలిస్తే.. 2021 క్యూ1లో పసిడి ధర ఔన్సుకు 1,874 డాలర్ల నుంచి 1,795 డాలర్లకు తగ్గింది. అయినప్పటికే గత ఏడాది క్యూ1తో (1,583 డాలర్లు) పోలిస్తే ఇది 13.32 శాతం ఎక్కువ.
  • ఆభరణాల డిమాండ్ ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 52 శాతం పుంజుకుని 477.4 టన్నులకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో ఈ మొత్తం 313.2 టన్నులు మాత్రమే.
  • సాంకేతిక రంగంలో పసిడి వినియోగం 2021 క్యూ1లో 11 శాతం పెరిగి.. 81.1 టన్నులకు చేరింది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఈ మొత్తం 72.9 టన్నులుగా ఉంది.

ఇదీ చదవండి:కరోనా వ్యాక్సిన్లపై జీఎస్​టీ తొలగింపు?

ABOUT THE AUTHOR

...view details