తెలంగాణ

telangana

ETV Bharat / business

'ప్రపంచంలో అత్యుత్తమ పెట్టుబడులకు హైదరాబాద్‌ గమ్యస్థానం' - కేటీఆర్ వార్తలు

ప్రస్తుత సంక్షోభంలో తెలంగాణ ఫార్మా, లైఫ్ సైన్స్ రంగాలకు అనేక అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన వెబినార్​లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల ప్రాధాన్యతను, భవిష్యత్తు ప్రణాళికలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైసెస్ పార్క్, హైదరాబాద్ ఫార్మా సిటీ వంటి ప్రాజెక్టులతో హైదరాబాద్ ప్రపంచంలోనే అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా నిలుస్తోందని.. కొవిడ్ సంక్షోభం అనంతరం ఫార్మా, లైఫ్ సైన్సెస్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తామని కేటీఆర్ తెలిపారు.

ktr
ktr

By

Published : Jul 28, 2020, 3:39 PM IST

Updated : Jul 28, 2020, 3:55 PM IST

రెండు దశాబ్దాల క్రితం భారత్‌లో ఐటీ పరిశ్రమ.. లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించి.. ఒక అద్భుతమైన అవకాశంగా మారిందో అలాంటి పరిస్థితి ఈరోజు ఫార్మా, లైఫ్ సైన్స్ రంగంలో నెలకొని ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేవలం కరోనా సంక్షోభంలో మాత్రమే కాకుండా సంక్షోభం తర్వాత ఫార్మా, లైఫ్ సైన్సు రంగంలో అనేక అవకాశాలు ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ రంగంలో భవిష్యత్తు అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరమైన అన్ని ప్రణాళికలను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేసుకుంటుందని మంత్రి తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన వెబినార్​లో మంత్రి పాల్గొన్నారు.

30 శాతం వ్యాక్సిన్స్ హైదరాబాద్ నుంచే..

ఐటీ రంగంలోని టాప్ ఫైవ్ కంపెనీలు ఏవిధంగా అయితే తమ రెండో అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయో అదేవిధంగా నోవార్టిస్ లాంటి ఫార్మా దిగ్గజాలూ హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ప్రపంచంలోని మొత్తం వ్యాక్సిన్లలో సుమారు 30 శాతానికి పైగా హైదరాబాద్ నగరం నుంచే ఉత్పత్తి కావడం తెలంగాణకి గర్వకారణమని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారత్ బయోటెక్ లాంటి కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ముందు వరుసలో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.

కేవలం మందుల తయారీ మాత్రమే కాకుండా భవిష్యత్తులో డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వంటి రంగాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

త్వరలో డ్రోన్లతో మందుల పంపిణీ

వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో పలు కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో "మెడిసిన్స్ ఫ్రం ద స్కై" వంటి కార్యక్రమాన్ని అపోలో ఆసుపత్రి భాగస్వామ్యంతో చేపట్టి అత్యవసర సమయాల్లో డ్రోన్లతో మందులను సరఫరా చేసే అంశంపైన పని చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఫార్మా రంగంలో పోటీకి మాత్రమే కాకుండా భాగస్వామ్యలకు అనేక అవకాశాలు ఉన్నాయని ఆ వైపు దృష్టి సారించాలని కంపెనీలకు కేటీఆర్ సూచించారు.

ఇదీ చదవండి:ఈ ప్రయోగం ఫలిస్తే.. కరోనా వ్యాక్సిన్ వచ్చేసినట్టే!

Last Updated : Jul 28, 2020, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details