నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్ల కేసుల్లో.. ఇప్పటి వరకు 258 మందిని అరెస్టు చేశారు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు. ఇందులో కనీసం 8 మంది ఛార్టెడ్ అకౌంటెంట్లు (సీఏలు) ఉన్నట్లు తెలిపారు. వీరంతా పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను నడిపిస్తూ.. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ను క్లెయిమ్ చేసుకుంటున్నట్లు గుర్తించామని అధికారులు వివరించారు.
మొత్తం 8,000 వేల నకిలీ జీఎస్టీ నంబర్లతో నిర్వహిస్తున్న డొల్ల కంపెనీలపై 2,500కిపైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చివరగా అరెస్టు చేసిన ఛార్టెడ్ అకౌంటెంట్ ఎలాంటి వస్తు, సేవల కార్యకలాపాలు లేకుండానే.. 25 నకిలీ సంస్థలను నడిపిస్తున్నట్లు తెలిపారు.
గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న 258 మందిలో కనీసం ఇద్దరిపై కన్సర్వేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ స్మగ్లింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు వివరించారు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు. జీఎస్టీ మోసాలకు పాల్పడుతున్న వారి నుంచి ఇప్పటి వరకు రూ.820 కోట్లు జప్తు చేసినట్లు పేర్కొన్నారు.
'బీఏఎఫ్టీఏ టూల్స్తో పాటు డేటా అనలటిక్స్, డేటా షేరింగ్, కృత్రిమ మేధ వంటి సాంకేతికతలను ఉపయోగించి.. నకిలీ సంస్థల కార్యకలాపాలను గుర్తించాం' అని అధికారులు 'ఈటీవీ భారత్'కు వివరించారు.