తెలంగాణ

telangana

ETV Bharat / business

పద్దు​ 2019: అంకురాల ఆశలకు కాస్త దగ్గరగా...

అంకురాలను ప్రోత్సహించటానికి బడ్జెట్​లో కీలక చర్యలు ప్రతిపాదించింది కేంద్రం. పెండింగ్​లో ఉన్న ఆదాయ పన్ను గణన కేసుల పరిష్కారానికి ప్రత్యేక ఏర్పాట్లతోపాటు పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది.

By

Published : Jul 5, 2019, 6:24 PM IST

పద్దు​ 2019: అంకురాల ఆశలకు కాస్త దగ్గరగా...

బడ్జెట్​లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ అంకురాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఏంజెల్​ పన్ను సమస్య పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

అధికారుల వేధింపులుండవు...

పెట్టుబడిదారులు, అంకురాలు డిక్లరేషన్​ ఇచ్చి, రిటర్నులలో పొందుపరిస్తే.. షేర్ల ప్రీమియం విలువపై ఎలాంటి తనిఖీ ఉండదని ప్రకటించారు. పెట్టుబడిదారుల గుర్తింపు కోసం, వారి నుంచి వచ్చే నిధులు మూలాల కోసం ఈ-వెరిఫికేషన్​ వ్యవస్థను తీసుకువస్తామని తెలిపారు. ఈ విధానంలో ఆదాయ పన్ను అధికారుల నుంచి తనిఖీలు పేరుతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు ఆర్థికమంత్రి.

పెండింగ్​లో ఉన్న అంకురాల అసెస్​మెంట్​, ఫిర్యాదుల పరిష్కారం కోసం కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు నిర్మల. ఉన్నతాధికారి అనుమతి లేకుండా అసెసింగ్​ అధికారి విచారణ, వెరిఫికేషన్​ ఉండదని తెలిపారు.

ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్స్​కు ఊతం...

ప్రస్తుతం క్యాటగిరీ-1 ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్లలో ఉన్న వారితో పాటు మరికొందరికి ఇచ్చిన అంకుర షేర్లకు ఫేర్​ మార్కెట్​ విలువను సరిచూడాల్సిన అవసరం లేదు. ఈ మినహాయింపును క్యాటగిరీ-2కు కూడా వర్తింపచేసింది కేంద్రం.

ఆదాయ పన్ను చట్టం ప్రకారం అంకురాలు ఫేర్​ మార్కెట్​ విలువ కంటే ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పొందినట్లయితే అందులో 30 శాతాన్ని పన్ను కట్టాల్సి ఉంటుంది. ఇదే ఏంజెల్​ పన్ను. ఈ ఏడాది ఫిబ్రవరిలో అంకురాల నిర్వచనాన్ని మార్చిన కేంద్రం.. ఏంజెల్​ పన్ను మినహాయింపును 25 కోట్లకు పెంచింది. మొత్తం 540 అంకురాలు ఈ మినహాయింపు ద్వారా లబ్ధిపొందాయి.

మూలధన లాభాలు...

అంకురాల్లో పెట్టుబడులు పెట్టటానికి ఇళ్లు అమ్మగా వచ్చిన డబ్బును ఉపయోగిస్తే... మూలధన లాభాలపై విధించే పన్ను నుంచి మినహాయింపును 2021 మార్చి 31 వరకు పొడగించారు. ఇందుకు సంబంధించి కొన్ని నిబంధనలనూ సడలించనున్నట్లు బడ్జెట్​ ప్రసంగంలో తెలిపారు ఆర్థికమంత్రి.

అంకురాల్లో 51 శాతం వాటా, 100 శాతం వాటా కలిగి ఉంటే వచ్చిన నష్టాలను వచ్చే సంవత్సరానికి బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అంకురాల్లో ఓటింగ్​ హక్కుల కోసం కావాల్సిన వాటాను 25 శాతానికి తగ్గించారు.

ప్రత్యేక ఛానల్​...

అంకురాలకు సంబంధించి ప్రత్యేక ఛానల్​ తీసుకురానుంది కేంద్రం. ఇది అంకురాలకు సంబంధించి పెట్టుబడిదారులు, వెంచర్​ క్యాపిటలిస్టులు లాంటి వారికి చర్చా వేదికగా ఉండనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details