కరోనా మహమ్మారి వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) తీవ్రంగా కుదేలయ్యాయని భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) వెల్లడించింది. లాక్డౌన్ నేపథ్యంలో ఇచ్చిన మారటోరియం వెసులుబాటును ఐదింట నాలుగు ఎంఎస్ఎంఈలు వినియోగించుకోవడమే ఇందుకు ఉదాహరణగా తెలిపింది.
'ట్రెండ్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2019-2020' పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలు పేర్కొంది ఆర్బీఐ. ఏప్రిల్తో పోలిస్తే.. ఆగస్టు నాటికి మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకునే రుణ గ్రహీతల సంఖ్య తగ్గినట్లు వెల్లడించింది.
దేశవ్యాప్త లాక్డౌన్లో ఈఎంఐల వాయిదా సదుపాయాన్ని భారీ సంఖ్యలో ఎంఎస్ఎంఈలు వినియోగించుకున్నాయని వివరించింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంఎస్ఎంఈలు వెన్నెముకగా భావిస్తుండటం, ఉద్యోగ కల్పనలో ఎక్కువ భాగం వీటిదే కావడం వల్ల.. పరిస్థితి తీవ్రత ఎంతలా ఉందో అర్థమవుతుందని వివరించింది.
ఇటీవలి అధికారిక గణాంకాల ప్రకారం.. 2020 ఆగస్టు చివరి నాటికి 45% బ్యాంక్ వినియోగదారులు (కార్పొరేట్లు, ఎంఎస్ఎంఈలు, వ్యక్తిగత, ఇతర రుణ గ్రహీతలు) మారటోరియం సదుపాయాన్ని వినియోగించుకున్నట్లు తెలిసింది. మొత్తం రుణాల్లో వీరి వాటా 40% శాతంగా ఉంది.
ఎంఎస్ఎంఈ రుణాల్లో ఇలా..
మొత్తం 78 శాతం ఎంఎస్ఎంఈలు ఈఎంఐల వాయిదాను ఎంచుకున్నాయి. ఎస్ఎంఈలకు ఇచ్చిన మొత్తం రుణాల్లో ఈ 77.5 శాతం వీటిదేనని ఆర్బీఐ నివేదిక వివరించింది. ఎస్ఎంఈ విభాగంలో 45 శాతానికిపైగానికి పైగా రుణగ్రహీతలు మారటోరియంను వినియోగించుకున్నారు. 43 శాతం మంది వ్యక్తిగత రుణగ్రహీతలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. కార్పొరేట్ రుణ గ్రహీతల్లో 31 శాతం మాత్రమే మారటోరియంను వినియోగించుకోవడం గమనార్హం.