సాధారణంగా కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతుందంటే.. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు.. వేతన జీవుల నుంచి కార్పొరేట్ల వరకు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అలాంటిది ఈ సారి కరోనా వల్ల ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల నడుమ బడ్జెట్ రాబోతోంది. దీనితో అన్ని రంగాల్లో అంచనాలు మరింత పెరిగాయి.
కరోనా వల్ల తీవ్రంగా కుదేలైన రంగాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) కూడా ప్రధానంగా ఉన్నాయి. దీనితో ఎంఎస్ఎంఈలు కొవిడ్ తెచ్చిన సంక్షోభం నుంచి బయటపడేందుకు.. అన్ని సాధారణ నిబంధనల్లో ఐదేళ్ల మారటోరియం అవసరమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు సూచిస్తున్నారు నిపుణులు. ఈ సారి బడ్జెట్లో ఆ దిశగా నిర్ణయాలు ఉండాలని అంటున్నారు.
'దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న ఎంఎస్ఎంఈలు కరోనా నుంచి తేరుకోవాలంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.' అని ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (ఎఫ్కేసీసీఐ) మాజీ అధ్యక్షుడు డీ మురళీధర్ 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
పర్యావరణం, పన్నులు సహా వివిధ నిబంధనలు.. ఎంఎస్ఎంఈలు, మధ్య స్థాయి పరిశ్రమలకు భారంగా మారుతున్నాయని అంటున్నారు మురళీధర్. 'నిబంధనలపై మారటోరియం విధించడం అనేది పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో పని. దీని వల్ల అదనపు ఆర్థిక భారంల కూడా పడదు. కానీ ఎంఎస్ఎంఈలకు మాత్రం డబ్బు, సమయం రెండు ఆదా అవుతాయి.' అని చెబుతున్నారు.
కేంద్ర గణాంక కార్యాలయం అంచనాల ప్రకారం.. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ఔట్పుట్లో 30 శాతం ఎంఎస్ఎంఈలదే. మొత్తం ఎగుమతుల్లో 48 శాతంతో వీటి ద్వారానే జరుగుతున్నాయి. 11 కోట్ల మందికి ఎంఎస్ఎంఈలు ఉపాధి కల్పిస్తున్నాయి.