దేశంలో ప్రభుత్వ వ్యయాలు, ప్రైవేటు వినియోగం క్షీణత దశలో ఉన్నందున.. 2021-22 బడ్జెట్లో మరింత విస్తృతంగా కేటాయింపులు ఉండాలని ఆర్థిక నిపుణులు కేంద్రానికి సూచిస్తున్నారు.
కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థలో వినాశనం సృష్టించిందని 14వ ఆర్థిక సంఘం సభ్యుడు ఎం.గోవింద రావు 'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ కారణంగా ప్రజా పరిపాలకు, రక్షణకు, ఇతర సేవలకు ప్రభుత్వ వ్యయాలు జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 12.2 శాతం తగ్గినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ప్రైవేటు తుది వినియోగ వ్యయాలు 54.2 శాతానికి పడిపోయినట్లు వివరించారు.
ఈ గణాంకాలన్నీ ఆర్థిక వ్యవస్థలో బలహీన డిమాండ్ను సూచిస్తున్నాయన్న గోవింద రావు.. రానున్న బడ్జెట్లో ఆదాయం, మూలధన వ్యయాలను పెంచడం ద్వారా పోత్సాహమందిచాలని ప్రభుత్వానికి సూచించారు.
ఆదాయం పెంచుకోవచ్చిలా..
వ్యయాలు పెంచేందుకు కావాల్సిన ఆదాయాన్ని రుణాలు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా పొందొచ్చని చెబుతున్నారు గోవింద రావు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ మార్గాలను వివరిస్తూ.. ఆర్థిక ఏకీకరణ ప్రణాళికకు 2022-23 ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు జీడీపీలో 7 శాతంగా సమానంగా నమోదవ్వొచ్చన్నారు.