నల్లజాతీయుడు జార్జి ప్లాయిడ్ మృతి అనంతరం అమెరికా నిరసనలతో అట్టుడుకుతోంది. ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలలు దేశమంతటా వ్యాపించాయి. ఈ నిరసనలకు గూగుల్, యూట్యూబ్లు మద్దతు తెలిపాయి. హోంపేజ్లో నల్లరంగు బ్యాడ్జీలతో సందేశాన్ని ప్రదర్శించాయి.
'జాతి సమానత్వం కోసం జరగుతున్న ఆందోళనలకు, దాని కోసం అన్వేషిస్తోన్న వారికి మద్దతుగా ఉంటాం' అని గూగుల్ హోంపేజ్లో ఆదివారం సందేశం ఉంచారు. ఇదే సందేశాన్ని యూఎస్ యూట్యూబ్ హోంపేజ్లోనూ ప్రదర్శించారు.
ఆల్ఫాబెట్, గూగుల్ సీఈవో సందర్ పిచాయ్ ఈ విషయంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.
"జాతి సమానత్వం కోసం జరుగుతున్న నిరసనలకు గూగుల్, యూట్యూబ్ హోం పేజ్ల ద్వారా మద్దతు తెలుపుతున్నాం. నల్లజాతీయులకు, జార్జి ఫ్లాయిడ్, బ్రియన్నా టేలర్, అహ్మౌద్ అర్బెరీ సహా గళం విప్పలేని ఇతరులకు సంఘీభావం తెలుపుతున్నాం. దుఃఖం, ఆగ్రహం, విచారం, భయంతో ఉన్న మీరంతా ఒంటరి కాదు"
-సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ
మానవత్వానికే మచ్చ తెచ్చే సంఘటన అమెరికాలో గతవారం జరిగింది. జార్జి ఫ్లాయిడ్ మెడను ఓ కర్కశ పోలీసు మోకాలితో తొక్కిపెట్టడం వల్ల ఊపిరాడక గిజగిజలాడిపోయి చివరకు మరణించాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంకెన్నాళ్లు ఈ జాత్యహంకారం అని అమెరికా వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: పోలీసు కర్కశం- నల్లజాతీయుడిని మోకాలుతో తొక్కిపట్టి..