చైనా టెలికాం దిగ్గజం హువావేకు బ్రిటన్ షాకిచ్చింది. బ్రిటన్ 5జీ నెట్వర్క్ నుంచి హువావేను నిషేధించింది. యూకేలోని 5జీ నెట్వర్క్ల నుంచి 2027 కల్లా హువావే పరికరాలను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది.
హువావేపై అమెరికా తాజా ఆంక్షలను పరిగణనలోకి తీసుకోవడం సహా సైబర్ నిపుణుల నుంచి సలహాలు తీసుకుని, నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్(ఎన్సీఎస్సీ) సమీక్ష అనంతరం యూకే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది.
2020 డిసెంబరు 31 తరువాత 5జీ పరికరాలేవీ హువావే వద్ద కొనకుండా పూర్తిస్థాయి నిషేధం విధించింది. ప్రధాని బోరిస్ జాన్సన్ ఆధ్వర్యంలో జరిగిన యూకే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఈ మేరకు తీర్మానాలు ఆమోదించింది.
'5జీ మన దేశ తీరునే మార్చనుంది. అయితే ఆ నెట్వర్క్ మనదేశ భద్రత, మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నప్పుడే' అని యూకే డిజిటల్ మంత్రి ఓలివర్ డౌడెన్ పేర్కొన్నారు. 2021 జనవరి నుంచి హువావే పరికరాలు వేటినీ యూకే 5జీ నెట్వర్క్లో కొత్తగా అమర్చరని స్పష్టం చేశారు. యూకే 5జీ నెట్వర్క్లో 2027కు హువావే పరికరాలే ఉండవని వివరించారు.