తెలంగాణ

telangana

By

Published : Sep 15, 2019, 5:45 PM IST

Updated : Sep 30, 2019, 5:43 PM IST

ETV Bharat / business

కేబుల్, డీటీహెచ్ బిల్ తగ్గే రోజు అతి దగ్గర్లోనే!

కేబుల్​ టీవీ, డీటీహెచ్​ల ఛార్జీలు తగ్గించేందుకు నిబంధనలను సవరించే దిశగా ట్రాయ్ అడుగులు వేస్తోంది. త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన టారీఫ్​లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

కేబుల్​ టీవీ

కేబుల్ టీవీ, డీటీహెచ్​ వినియోగదారులకు టెలికాం నియంత్రణ సంస్థ 'ట్రాయ్​' శుభవార్త తెలిపింది. టీవీ ఛానెళ్ల వీక్షణలో ఛార్జీల మోతపై పునరాలోచించనున్నట్లు ప్రకటించింది.

ఈ ఏడాది ఏప్రిల్​ నుంచి కేబుల్ టీవీ, డీటీహెచ్​లకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకువచ్చింది ట్రాయ్​. వీటి కారణంగా గతంతో పోలిస్తే.. ప్రస్తుతం కేబుల్​ టీవీ, డీటీహెచ్​ల నెలవారీ చందాలు భారీగా పెరిగాయి. ఈ విషయంపై చాలా మంది ధరలు తగ్గించాలని తమకు ఫిర్యాదు చేసినట్లు ట్రాయ్​ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ దిశగా సవరణలు చేసేందుకు యోచిస్తున్నట్లు పేర్కొంది.

ట్రాయ్ ఏమందంటే..

కేబుల్​ టీవీ రంగంలో పారదర్శకతే ప్రాథమిక లక్ష్యంగా కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు ట్రాయ్​ స్పష్టం చేసింది. అయితే ఈ కారణంగా ధరలు పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించింది.

ముఖ్యంగా కొత్త నిబంధనలతో నిర్దిష్ట ఎన్​సీఎఫ్ ఛార్జీలను అమలు చేస్తోంది ట్రాయ్​. ఫలితంగా ప్రతీ వినియోగదారు ఏదైనా పే ఛానల్ చూడాలన్నా రూ.153 ఎన్​సీఎఫ్​ ఛార్జీని తప్పనిసరిగా చెల్లించాలి. ఇంతకుముందు ఇలాంటి నిబంధన లేదు. ఛార్జీలు పెరిగేందుకు ఇదీ ఒక కారణమైంది.

టీవీలు వీడి.. ఓటీటీల వైపు

అధిక ఛార్జీల కారణంగా చాలా మంది వినియోగదారులు లైవ్​ టీవీ ప్రసారాలు సన్​నెక్ట్స్, జీ5, హాట్​ స్టార్​, జియో టీవీ వంటి ఓటీటీ ప్లాట్​ ఫారాలపై చూసేందుకు మొగ్గుచూపుతున్నారు. వినియోగదారులకు ఈ యాప్​లు సౌలభ్యంగా ఉండటం వల్ల వాటి వినియోగం పెరిగి... డీటీహెచ్​, కేబుల్ టీవీల వినియోగం తగ్గింది. ఈ నేపథ్యంలో మళ్లీ ధరలు నియంత్రించి కేబుట్​ టీవీ, డీటీహెచ్​ల వినియోగం పెంచే దిశగా ట్రాయ్​ అడుగులు వేస్తోంది.

ట్రాయ్​ సవరణలపై అంచనాలు...

ట్రాయ్​ ప్రకటనతో ఎలాంటి సవరణలు ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో ప్రధానంగా లాంగ్​ టర్మ్ ప్లాన్​లు, మల్టీ టీవీలపై 'ఎన్​సీఎఫ్'​ ఛార్జీలు తగ్గించే అవకాశముందని​ వార్తా సంస్థలు అంటున్నాయి. అనవసర ఛానెళ్లు అందించి డీటీహెచ్​ ఆపరేటర్లు వసూలు చేస్తున్న అధిక ఛార్జీలకు అడ్డుకట్ట వేయాలని ట్రాయ్ భావిస్తోందనే అంచనాలున్నాయి. ఇంకా ఎలాంటి మార్పులు చేస్తుందనే విషయం తెలియాలంటే ట్రాయ్​ ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

ఇదీ చూడండి: 'వాట్సాప్​ సందేశాలు ట్రేస్​ చేయాల్సిందే'

Last Updated : Sep 30, 2019, 5:43 PM IST

ABOUT THE AUTHOR

...view details