దేశీయ మొబైల్ రంగంలో టారిఫ్ల పెంపు రేపో, మాపో తప్పదనేలా ఇటీవలి వరకు కంపెనీల ప్రకటనలుండేవి. పరిశ్రమ మనుగడ కోసం ఛార్జీల పెంపు తప్పదని, నెట్వర్క్ విస్తృతికి ఇది అవసరమని కొంత కాలంగా ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ప్రకటిస్తూ వచ్చాయి. అయితే మార్కెట్ లీడర్ రిలయన్స్ జియో ఈ దిశగా చర్యలు తీసుకోకపోవడం వల్ల ఆ సంస్థలు కూడా ఛార్జీల పెంపులో దూకుడు కనబరచలేదు. తమ కంటే నెలవారీ కనెక్షన్ల పెంపులో ఎయిర్టెల్ ముందుండటం, దానితో పాటు వొడాఫోన్ ఐడియాకు ఉన్న 2జీ ఫీచర్ఫోన్ల వినియోగదారులను ఆకట్టుకునే భారీ ప్రణాళికను జియో ప్రకటించింది. రూ.1,999కే ఫోన్ కూడా ఇస్తూ, రెండేళ్ల పాటు అపరిమిత కాల్స్, డేటా ఆఫర్ ఇవ్వడం ద్వారా ఇప్పట్లో ఛార్జీల పెంపునకు సుముఖంగా లేమనే సంకేతాలు జియో ఇచ్చినట్లయ్యింది. మిగిలిన నెట్వర్క్ సంస్థలకు ఇది ఇబ్బంది కరమే అయినా, ప్రస్తుతానికి వినియోగదారులకు మాత్రం ఊరట కలిగించే అంశం.
జియోఫోన్ కథేంటి..
దేశంలో 30 కోట్ల మంది 2జీ వినియోగదార్లను 4జీకి మార్చడమే లక్ష్యమంటూ గతవారం ‘కొత్త జియోఫోన్ 2021’ను రిలయన్స్ జియో విడుదల చేసింది. రెండేళ్ల పాటు అపరిమిత కాల్స్, నెలకు అధికవేగం 2జీబీ డేటా, అనంతరం పరిమిత వేగంతో అపరిమిత డేటా, కొత్త జియోఫోన్లను కేవలం రూ.1,999కి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత జియోఫోన్ వినియోగదారులు రూ.749 చెల్లించి ఏడాది కాలానికి అపరిమిత కాల్స్, డేటా సదుపాయాలు పొందొచ్చు. దీంతోపాటు నెలకు రూ.22 నుంచి మరో 5 ప్రీపెయిడ్ పథకాలను కూడా జియోఫోన్ చందాదార్ల కోసం తెచ్చింది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా 2జీ చందాదార్లు ఇప్పటికీ నెలకు అధికమొత్తాలు చెల్లిస్తున్నారని, వీరికి తక్కువ ఖర్చయ్యే పథకాలతో తమ నెట్వర్క్కు ఆకర్షించగలమని జియో భావిస్తోంది. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న జియో ఖాతాదారుల వృద్ధి.. జియోఫోన్తో మళ్లీ గాడిలో పడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వరుసగా అయిదో నెలలోనూ..