Tax Savings: ఆర్థిక సంవత్సరం 2022, మార్చి 31తో ముగుస్తుంది. చూడ్డానికి మూడు నెలలకు పైగానే సమయం ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, మనం ఆలోచించి, నిర్ణయం తీసుకొని, పెట్టుబడులు పెట్టే సరికి.. ఈ కాలం ఇట్టే గడిచిపోతుంది. అప్పుడు ఆదాయపు పన్ను చెల్లించడం మినహా ప్రత్యామ్నాయం ఉండదు.
భారం ఎంత?
మొత్తం ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం ఎంతమేరకు ఉంటుందనే విషయంలో ఒక స్పష్టత వచ్చే ఉంటుంది. మీ కార్యాలయంలో ఈ వివరాలు అడగండి. దీంతోపాటు మొత్తం పన్ను ఎంత చెల్లించాల్సి వస్తుంది? ఇప్పటికి ఎంత చెల్లించారు? మిగిలింది ఎంత?లాంటి వివరాలూ తెలుసుకోండి. దీనివల్ల ఏయే సెక్షన్ల కింద ఇంకా ఎంత మినహాయింపు పొందేందుకు అర్హులన్నది అవగాహన వస్తుంది. తర్వాత అవసరమైన మేరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవ్వాలి.
పరిమితుల మేరకు..
ముందే అనుకున్నట్లు.. ఏ సెక్షన్ కింద ఇంకా ఎంత మినహాయింపు పొందేందుకు వీలుందో చూసుకోవాలి. సెక్షన్ 80సీ కింద రూ.1,50,000 వరకూ పరిమితి ఉంటుంది. ఈపీఎఫ్, పీపీఎఫ్, జీవిత బీమా పాలసీలు, ఇంటి రుణం అసలు, పిల్లల ట్యూషన్ ఫీజులు, ఈఎల్ఎస్ఎస్, పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎన్ఎస్సీ, కిసాన్ వికాస పత్ర, సుకన్య సమృద్ధి యోజన.. ఇలా అనేక మార్గాల్లో ఈ మొత్తాన్ని మదుపు చేసేందుకు వీలుంటుంది. ఈ పరిమితి పూర్తి కాకపోతే.. దాన్ని భర్తీ చేయొచ్చు. ఆరోగ్య బీమా పాలసీలకు సంబంధించి సెక్షన్ 80డీ కింద మినహాయింపు లభిస్తుంది. ఇందులో రూ.25వేల వరకూ మినహాయింపు పొందవచ్చు. తల్లిదండ్రుల పేరుమీద తీసుకున్న పాలసీకి మరో రూ.25వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. వారు సీనియర్ సిటిజన్లయితే.. రూ.50వేల వరకూ పరిమితి ఉంటుంది. దీంతోపాటు.. రూ.5,000 వైద్య పరీక్షల ఖర్చు కోసం చూపించుకోవచ్చు. ఇక్కడ చూసుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. అందుబాటులో ఉన్న అన్ని మినహాయింపులనూ వినియోగించుకోవడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవాలి.
గృహ, విద్యా రుణాలుంటే..