ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్), దేశీయ వ్యాపారాలపై టాటా మోటార్స్ రూ.28,900 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. '2020-21లోరూ.19,800 కోట్ల పెట్టుబడులు పెట్టాం. ఈ ఏడాదికి రూ.28,900 కోట్లని అనుకుంటున్నాం. ఇందులో జేఎల్ఆర్కు 2.5 బిలియన్ పౌండ్లు, టాటా మోటార్స్కు రూ.3000-3500 కోట్లు ఉండొచ్చ'ని తెలిపారు.
'హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాహనాల అభివృద్ధికి పెట్టుబడులు పెడుతున్నాం. 15 వాహనాల కోసం ఇండియన్ ఆయిల్ నుంచి తొలి ఆర్డరు సైతం పొందాం. అందులో ఏడింటిని సిద్ధం చేశామ'ని వివరించారు. 'విద్యుత్ వాహనాల(ఈవీ) వ్యాపారానికి కంపెనీ విడిగా మూలధనాన్ని సమీకరిస్తుంది. మధ్య నుంచి దీర్ఘకాలంలో ఈవీల విక్రయాలు ప్రస్తుత 2 శాతం నుంచి 25 శాతానికి చేరతాయని అంచనా వేస్తున్నామ'ని దృశ్యశ్రవణ మాధ్యమంలో జరిగిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశాన్ని(ఏజీఎమ్) ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.
'2025కు ముందే కనీసం 10 ఈవీలను ప్రవేశపెడతాం.. అందుకే తగిన సమయం చూసి ఈవీ విభాగానికి మూలధనాన్ని సమీకరిస్తాం. వాణిజ్య వాహనాల కోసం ప్రత్యేక ఈవీ ప్లాట్ఫాంను త్వరలో కంపెనీ ఆవిష్కరించనుంద'న్నారు. అందుబాటు ధర ఈవీలపై టాటా మోటార్స్ పనిచేస్తోందని చెప్పారు. టిగోర్ ఈవీ మరింత అధికశ్రేణిలో రానుందని పేర్కొన్నారు.