ఎవరి దగ్గరైనా డబ్బులు బాగా ఉంటే వాళ్లను టాటాబిర్లాలు అని అనేవాళ్లం. ఇక నుంచి అంబానీ అదానీలు అని అనాలేమో. ఏడాదికాలంలో గౌతమ్ అదానీ, ముకేశ్ అంబానీల సంపద పెరిగిన తీరు చూస్తే ఇలాగే అనిపిస్తుంది. 2019 డిసెంబరు చివరినాటితో పోలిస్తే ఇప్పటికే అదానీ-అంబానీల సంపద విలువ రూ.లక్ష కోట్లకు పైగా పెరగిందని ఆంగ్లపత్రిక ఈటీ పేర్కొంది. కొవిడ్ వ్యాప్తి చెందిన ఏడాది కాలంలో దేశీయంగా ఏడుగురు కుబేరుల సంపద సుమారు రూ.4,73,000 కోట్లు (64 బిలియన్ డాలర్ల) మేర వృద్ధి చెందింది.
సైరస్ పూనావాలా (సీరమ్ ఇన్స్టిట్యూట్), శివ్ నాడార్ (హెచ్సీఎల్ టెక్నాలజీస్), అజీమ్ ప్రేమ్జీ (విప్రో), రాధాకిషన్ దమానీ (డిమార్ట్), దిలీప్ సంఘ్వీ (సన్ ఫార్మా) సంపద విలువ గణనీయంగా వృద్ధి చెందింది. కరోనా పరిణామాల నేపథ్యంలో ఒక దశలో స్టాక్ మార్కెట్ భారీ కుదుపునకు లోనైనప్పటికీ.. ఆ తర్వాత పుంజుకుని, సూచీలు రికార్డు స్థాయిలకు చేరిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్ ఏడాదికాలంలో 11.5 శాతం మేర పెరిగింది. సెన్సెక్స్ కంటే మించి ఈ ఏడుగురి కంపెనీల షేర్లు రాణించడం విశేషం. వీళ్ల సంపద అమాంతంగా పెరగడం వెనక ఇదే ముఖ్య కారణం.
సంపద వద్ధి ఇలా..
అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు 525 శాతం పెరగడం గౌతమ్ అదానీ సంపద వృద్ధిలో కీలక పాత్ర పోషించింది. 2019 డిసెంబరు 31లో అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ విలువ రూ.26,040 కోట్లు.. 2020 డిసెంబరు 12 నాటికి ఈ విలువ రూ.1.63 లక్షల కోట్లకు చేరింది. అదానీ గ్యాస్ షేరు 120%, అదానీ ఎంటర్ప్రైజెస్ 116%, అదానీ ట్రాన్స్మిషన్ 28%, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ 27% చొప్పున పెరిగాయి. అయితే అదానీ పవర్ షేరు 27.91 శాతం నష్టపోయింది.
ముకేశ్ అంబానీకి చెందిన 6 కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదవ్వగా.. ఆయన సంపద భారీగా పెరగడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరే ప్రధాన పాత్ర పోషించిందని చెప్పొచ్చు. 2019 డిసెంబరు 31 చివరినాటికి ఆర్ఐఎల్ మార్కెట్ విలువ రూ.9.59 లక్షల కోట్లు ఉంటే.. 2020 డిసెంబరు 12 నాటికి అది అమాంతం పెరిగి రూ.13.56 లక్షల కోట్లకు చేరింది. ముకేశ్కు చెందిన మిగతా ఐదు కంపెనీల షేర్లు- హాథ్వే భవానీ కేబుల్టెల్ అండ్ డేటాకామ్ 468%, హాథ్వే కేబుల్ అండ్ డేటాకామ్ 72.38%, నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్ 49%, డెన్ నెట్వర్క్స్ 42%, రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 37% మేర రాణించాయి.
శివ్నాడార్కు చెందిన హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేరు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 52 శాతం ప్రతిఫలాన్ని పంచగా.. అజీమ్ ప్రేమ్జీ విప్రో షేరు 43.82 శాతం మేర పెరిగింది. రాధాకిషన్ దమానీకి చెందిన అవెన్యూ సూపర్మార్ట్స్ 40.77%, దిలీప్ సంఘ్వీ సన్ ఫార్మా షేరు 31 శాతం చొప్పున లాభాలు పంచాయి.
ఇదీ చూడండి:ఎయిర్ ఇండియా కొనుగోలుకు టాటా గ్రూప్ బిడ్