కరోనా పరిణామాల ఫలితంగా చమురుకు గిరాకీ తగ్గడం వల్ల, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ నికర లాభం 15 శాతం క్షీణించి రూ.9,567 కోట్లకు చేరుకుంది. 2019-20 ఇదే త్రైమాసిక లాభం రూ.11,262 కోట్లు కావడం గమనార్హం. ఆదాయం సైతం 24 శాతం తగ్గి రూ.1,53,384 కోట్లుగా నమోదైంది. కంపెనీ మొత్తం ఆదాయాల్లో 35 శాతం వాటా ఉన్న వినియోగదారు ఆధార విభాగాలు మాత్రం రాణించాయి. సంస్థ సంప్రదాయ విభాగమైన పెట్రో రసాయనాల విభాగ ఆదాయం 23% తగ్గి రూ.29,665 కోట్లకు; పన్నుకు ముందు లాభం 33% తగ్గి రూ.5964 కోట్లకు పరిమితయ్యాయి.
"క్రితం త్రైమాసికం (ఏప్రిల్-జూన్ 2020)తో పోలిస్తే బలమైన ఆర్థిక పనితీరు కనబరచాం. పెట్రో రసాయనాలు, రిటైల్ విభాగాలు రాణించాయి. టెలికాంలో వృద్ధి కొనసాగింది. అన్ని విభాగాల్లో(ఓ2సీ) దేశీయ గిరాకీ పుంజుకుంది. చాలా వరకు ఉత్పత్తులు కరోనాకు ముందు స్థాయి దరిదాపులకు వచ్చాయి. లాక్డౌన్ ఆంక్షలు సడలడంతో రిటైల్ వ్యాపారంలో బలమైన వృద్ధి నమోదైంది. జియో, రిటైల్ వ్యాపారాల్లో వ్యూహాత్మక పెట్టుబడుదారులు వచ్చారు."
- ముకేశ్ అంబానీ, సీఎండీ, రిలయన్స్ ఇండస్ట్రీస్
త్రైమాసికం వారీగా వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్తో పోలిస్తే కంపెనీ ఏకీకృత ఆదాయం 27.2 శాతం వద్ధితో రూ.1,28,385 కోట్లకు చేరుకుంది. నికర లాభం కూడా (అసాధారణ అంశాన్ని పక్కనపెట్టాక) 28 శాతం వృద్ధితో రూ.10,602 కోట్లుగా నమోదైంది. ఈపీఎస్ రూ.14.8కు చేరుకుంది.
జియో.. జిగేల్..
టెలికాం విభాగం రాణించింది. సెప్టెంబరు త్రైమాసికంలో 73 లక్షల కొత్త కనెక్షన్లు జత చేరడంతో మొత్తం చందాదార్ల సంఖ్య 40.56 కోట్లకు చేరుకుంది. ఈ విభాగంలో నికర లాభం మూడింతలు పెరిగి రూ.2844 కోట్లకు చేరుకుంది. 2019 ఇదే త్రైమాసికంలో లాభం రూ.990 కోట్లు మాత్రమే. జియో ఆదాయం 33% వృద్ధితో రూ.17,481 కోట్లుగా నమోదైంది. వినియోగదారులపై సంస్థకు లభించే సగటు ఆదాయం(ఆర్పు) రూ.127.40 నుంచి 13.8% పెరిగి రూ.145కు చేరుకుంది. 2020 జూన్ త్రైమాసికంలో ఇది రూ.140.3గా ఉంది.