చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ తయారీ దగ్గజం 'వన్ప్లస్' మరోసారి మిడ్ రేంజ్ మోడల్ను మార్కెట్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రీమియం మోడళ్లతో.. యాపిల్, శాంసంగ్, హువావే వంటి సంస్థలకు గట్టిపోటీ ఇచ్చిన వన్ప్లస్.. ఇప్పుడు మిడ్ రేంజ్ సెగ్మెంట్లోని ఇతర కంపెనీలపై గురి పెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ వచ్చేదెప్పుడంటే..
2020 రెండో అర్ధభాగంలో వన్ప్లస్ 8 మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో వన్ప్లస్ 8, వన్ప్లస్ 8 ప్రో ఉండనున్నాయి. వీటితో పాటే 'వన్ప్లస్ 8 లైట్' మోడల్ను మిడ్ రేంజ్ సెగ్మెంట్లో మార్కెట్లోకి తీసుకురానుందని టెక్ వార్తా సంస్థలు అంటున్నాయి.
బెడిసికొట్టిన తొలి ప్రయత్నం..
వన్ప్లస్ నుంచి ఇదివరకే.. 'వన్ప్లస్ ఎక్స్' పేరుతో మిడ్ రేంజ్లో ఓ స్మార్ట్ ఫోన్ మోడల్ మార్కెట్లో విడుదలైంది. అయితే ఈ మోడల్కు మార్కెట్లో అనుకున్నంత డిమాండు రాలేదు. అప్పటి నుంచి ప్రీమియం సెగ్మెంట్కు మాత్రమే పరిమితమైంది వన్ప్లస్. మళ్లీ ఇప్పుడు ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త మోడల్ను మిడ్ రేంజ్లో తీసుకువచ్చి విజయం అందుకోవాలని ప్రయత్నిస్తోంది.
వన్ప్లస్ 8 లైట్ అంచనాలు..
టెక్ వార్తా సంస్థల ప్రకారం.. వచ్చే ఏడాది రాబోతున్న వన్ప్లస్ 8, 8 ప్రో మోడళ్లు 3డీ రెండర్స్, పంచ్ హోల్ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో రానున్నాయి. వన్ప్లస్ 8 లైట్లోనూ ఇవే ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. అయితే ఫోన్ సాఫ్ట్వేర్ ఎలా ఉండబోతోంది, ధర ఎంత వంటి విషయాలు తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.
వన్ప్లస్ మొబైళ్లు ఈ స్థాయిలో విజయం సాధించేందుకు ప్రధాన కారణాల్లో ఒకటి ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్). ఆండ్రాయిడ్ ఓఎస్కు చెందిన ఉత్తమ ఓఎస్గా దీనికి పేరుంది. ఈ కారణంగా ఆక్సిజన్ ఓఎస్తో మిడ్ రేంజ్లో వచ్చే.. వన్ప్లస్8 లైట్కు మార్కెట్లో మంచి డిమాండు ఉండొచ్చని స్మార్ట్ఫోన్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ఇదీ చూడండి:అక్టోబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ నేల చూపులు