ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నిలంజన్ రాయ్ అనైతిక పద్ధతులను అవలంబించినట్లు కంపెనీకి చెందిన కొంతమంది గుర్తుతెలియని ఉద్యోగులు బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు సెప్టెంబరు 20న రాసిన లేఖ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఆధారాలు....
"పరేఖ్, రాయ్ అనేక త్రైమాసికాలుగా అనైతిక పద్ధతులను అవలంబిస్తున్నారు. దానికి సంబంధించి ఈమెయిల్, వాయిస్ రికార్డింగ్ రూపంలో ఆధారాలు ఉన్నాయి’’ అని లేఖలో పేర్కొన్నట్లు పీటీఐ వెల్లడించింది. బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేనందున ఫిర్యాదుదారుల్లోని ఓ ప్రజావేగు అమెరికాలోని ‘విజిల్ బ్లోయర్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం’ కార్యాలయానికి అక్టోబర్ 3న మరో లేఖ రాశారు.
తప్పుడు లెక్కలు..
‘గత రెండు త్రైమాసికాలుగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు లెక్కలు చూపారు’ అని అందులో ఆరోపించారు. జూన్-సెప్టెంబరు త్రైమాసికంలో లాభాల్ని ఎక్కువ చేసి చూపడం కోసం వీసా వంటి ఖర్చుల్ని ఖాతాల్లో చూపొద్దని ఆదేశించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి వాయిస్ రికార్డింగులు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఓ కాంట్రాక్టు విషయంలో 50 మిలియన్ డాలర్లు విలువ చేసే మార్పులను పరిగణనలోకి తీసుకోవద్దని తమపై ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు.