తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇన్ఫోసిస్‌కు చిక్కులు- సీఈఓపై గోల్​మాల్​ ఆరోపణలు - ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ పై ఆరోపణలు

అనైతిక పద్ధతులు అవలంబిస్తున్నారంటూ ఇన్ఫోసిస్​కు చెందిన గుర్తుతెలియని ఉద్యోగులు కంపెనీ సీఈఓ సలీల్​ పరేఖ్​, సీఎఫ్​ఓ నిలంజన్​ రాయ్​ పై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు సెప్టెంబర్​ 20న లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖను ప్రముఖ మీడియా సంస్థలు బయటపెట్టాయి.

ఇన్ఫోసిస్‌ సీఈఓపై ఆరోపణలు..!

By

Published : Oct 21, 2019, 7:14 PM IST

Updated : Oct 21, 2019, 7:27 PM IST

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సీఈఓ సలీల్‌ పరేఖ్‌, సీఎఫ్‌ఓ నిలంజన్ రాయ్‌ అనైతిక పద్ధతులను అవలంబించినట్లు కంపెనీకి చెందిన కొంతమంది గుర్తుతెలియని ఉద్యోగులు బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు సెప్టెంబరు 20న రాసిన లేఖ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.

ఆధారాలు....

"పరేఖ్‌, రాయ్‌ అనేక త్రైమాసికాలుగా అనైతిక పద్ధతులను అవలంబిస్తున్నారు. దానికి సంబంధించి ఈమెయిల్‌, వాయిస్‌ రికార్డింగ్‌ రూపంలో ఆధారాలు ఉన్నాయి’’ అని లేఖలో పేర్కొన్నట్లు పీటీఐ వెల్లడించింది. బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేనందున ఫిర్యాదుదారుల్లోని ఓ ప్రజావేగు అమెరికాలోని ‘విజిల్‌ బ్లోయర్‌ ప్రొటెక్షన్‌ ప్రోగ్రాం’ కార్యాలయానికి అక్టోబర్‌ 3న మరో లేఖ రాశారు.

తప్పుడు లెక్కలు..

‘గత రెండు త్రైమాసికాలుగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు లెక్కలు చూపారు’ అని అందులో ఆరోపించారు. జూన్‌-సెప్టెంబరు త్రైమాసికంలో లాభాల్ని ఎక్కువ చేసి చూపడం కోసం వీసా వంటి ఖర్చుల్ని ఖాతాల్లో చూపొద్దని ఆదేశించినట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి వాయిస్‌ రికార్డింగులు ఉన్నట్లు తెలిపారు. అలాగే ఓ కాంట్రాక్టు విషయంలో 50 మిలియన్‌ డాలర్లు విలువ చేసే మార్పులను పరిగణనలోకి తీసుకోవద్దని తమపై ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు.

రివర్సల్స్‌ వల్ల త్రైమాసిక లాభాలకు గండిపడి షేర్ల ధరపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తమతో చెప్పారన్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని తెలిపారు. అలాగే కీలక సమాచారాన్ని ఆడిటర్లకు, బోర్డుకు తెలియకుండా దాచారని ఆరోపించారు. ప్రముఖ కంపెనీలతో కుదిరిన ఒప్పందాలు, కొనుగోళ్లకు సంబంధించిన అంశాల్లో తప్పుడు సమాచారం నమోదు చేసేలా ఒత్తిడి తెచ్చారన్నారు. వీటిని సంబంధించిన ఆధారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

షేర్​ ధర రాణించినంత కాలం...

పరేఖ్‌ చేతిలో కీలుబొమ్మగా మారిన రాయ్‌ సైతం అందుకు సహకరిస్తూ వస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. కంపెనీలో నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు ఈ కీలక సమాచారం చేరకుండా అడ్డుకున్నారని వెల్లడించారు. బోర్డు సభ్యులకు ఈ విషయాలేవీ అర్థం కావని.. షేరు ధర రాణించినంత కాలం వారు ఇవేమీ పట్టించుకోరని పరేఖ్‌ గతంలో వ్యాఖ్యానించినట్లు లేఖలో పేర్కొన్నారు.

కంపెనీ స్పందన...

దీనిపై స్పందించిన కంపెనీ.. ప్రజావేగు ఫిర్యాదుల్ని ఆడిట్‌ కమిటీ ఎదుట ఉంచుతామని ప్రకటించింది. కంపెనీ ప్రజావేగు నిబంధనల ప్రకారం దీన్ని పరిష్కరిస్తామని తెలిపింది..

Last Updated : Oct 21, 2019, 7:27 PM IST

ABOUT THE AUTHOR

...view details