నిన్న మొన్నటి వరకూ దేశీయ ఆటోమొబైల్ రంగంలో మందగమనం వల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవలసిన పరిస్థితి కనిపించింది. అన్ని వర్గాలు దీనిపై తీవ్ర ఆందోళన వెలిబుచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహాలో ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు చర్చనీయాంశంగా మారింది. వ్యయాలు తగ్గించుకునే ఉద్దేశం కావచ్చు, లేదా సాంకేతిక మార్పుల ఫలితమో.. కానీ ఉద్యోగాల కోతను ప్రకటిస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ పరిస్థితి ఐటీ నిపుణులను, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులను, వారి తల్లితండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిపోయేందుకూ తావిస్తోంది.
ఐటీ రంగంలో వచ్చే ఏడాది కాలంలో 30,000 నుంచి 40,000 మంది మధ్యస్థాయి ఉద్యోగులను కంపెనీలు తొలగించే అవకాశం ఉందంటూ నిన్నటికి నిన్న ఐటీ రంగ నిపుణుడు, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ బాంబు పేల్చటం గమనార్హం.
ఈ కంపెనీల్లో తగ్గుతున్నాయి..
- యూఎస్కు చెందిన కాగ్నిజెంట్ ఈ నెల మొదటి వారంలో ఉద్యోగాల కోతను ప్రకటించింది. వచ్చే కొద్ది నెలల్లో 10,000 నుంచి 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ సీఈఓ బ్రియాన్ హంఫెరీస్ స్పష్టం చేశారు. ఏ దేశంలో ఎంతమందిని తొలగిస్తారనేది చెప్పనప్పటికీ, మనదేశంపై అధిక ప్రభావం ఉంటుందనేది విస్పష్టం. కాగ్నిజెంట్ ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం మనదేశంలోనే పనిచేస్తున్నారు. కొన్ని విభాగాల నుంచి తాము వైదొలుగుతున్నట్లు, అందువల్ల ఉద్యోగాల కుదింపు అనివార్యంగా మారినట్లు కాగ్నిజెంట్ వివరించింది.
- దేశీయ ఐటీ దిగ్గజమైన ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 100 నుంచి 150 మిలియన్ డాలర్ల మేరకు వ్యయాలను తగ్గించుకోవాలనే ఆలోచనలో ఉంది. అందులో భాగంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని పరిశ్రమ వర్గాల విశ్లేషణ.
- పర్సనల్ కంప్యూటర్లు, ప్రింటర్లు సరఫరా చేసే సంస్థ అయిన హెచ్పీ ‘వ్యాపార పునర్వ్యవస్థీకరణ’లో భాగంగా వచ్చే మూడేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఏడు వేల నుంచి తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందులో మనదేశంలో 500 ఉద్యోగాలు ఉంటాయని అంచనా.
- యూఎస్కు చెందిన ‘వుయ్వర్క్‘ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 4,000 మందిని తొలగించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ ఛైర్మన్ మార్సెలో క్లారీ తాజాగా ఉద్యోగులకు రాసిన లేఖలో సూచనప్రాయంగా చెప్పారు. ఇందులో మనదేశంలో పనిచేస్తున్న ఆ కంపెనీ సిబ్బంది ఉంటారనేది విస్పష్టం. హైదరాబాద్తో సహా ముంబయి, బెంగళూరు, నోయిడా, గురుగ్రామ్, పుణె నగరాల్లో ‘వుయ్వర్క్’ కార్యకలాపాలు సాగిస్తోంది.
- జొమాటో రెండు నెలల క్రితం గురుగ్రామ్లోని తన కేంద్ర కార్యాలయంలో 550 మంది ఉద్యోగులను తొలగించింది. ఆటోమేషన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానంతో సామర్థ్యాన్ని పెంచుకుంటున్నందున ఉద్యోగుల సంఖ్య తగ్గింపు తప్పనిసరి అవుతోందని ఈ సందర్భంగా జొమాటో వివరించింది.
ఎందుకు ఇలా?