కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తి వల్ల ప్రపంచ వ్యాప్తంగా పని పద్ధతుల్లో ఎంతో మార్పు వస్తోంది. బృందాలుగా పనిచేయడానికి బదులు ఎక్కడో కూర్చుని, కంప్యూటర్తో పనిచేసే 'రిమోట్ వర్కింగ్' పద్ధతులు అమల్లోకి వస్తున్నాయి. అందుకే సైబర్ భద్రతకు ఎనలేని ప్రాధాన్యం వచ్చిందని అంటున్నారు మైక్రోసాఫ్ట్ డిజిటల్ క్రైమ్స్ యూనిట్ (ఆసియా) అసిస్టెంట్ జనరల్ కౌన్సెల్ మేరీ జో ష్రాడే. సైబర్ నేరాల ముప్పు ఏవిధంగా ఉంది, నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాపార సంస్థలు అనుసరించాల్సి విధానాలపై ఆమె 'ఈనాడు' కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలివీ.
'ఎక్కడి నుంచైనా పనిచేయడం' అనేది పెరుగుతోంది. సైబర్ భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందా?
కొద్ది నెలలుగా పరిశ్రమలు, వివిధ రకాల వ్యాపార సంస్థలు, ఎక్కడి నుంచైనా పని చేసే (వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ థర్డ్ పార్టీ లొకేషన్... వంటి 'రిమోట్ వర్కింగ్' విధానాలు) పద్ధతికి శరవేగంగా మారుతున్నాయి. ఎన్నో సంస్థలు సిబ్బందిని ఇంటి నుంచి పని చేయిస్తున్నాయి. ముఖ్యమైన వ్యాపార సమావేశాలన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఇది ఎంతో స్ఫూర్తిదాయక మార్పు. కానీ ఈ కార్యకలాపాలు ఎంత భద్రంగా సాగుతున్నాయనేది ప్రశ్నార్థకం? మనకు వస్తున్న మొబైల్ సందేశాలు, ఇ-మెయిళ్లలో అధిక భాగం కొవిడ్- 19 కు సంబంధించినవే ఉంటున్నాయి. ఏం ఉందో చూద్దామని, ఏమాత్రం సందేహించకుండా 'క్లిక్' చేస్తామని సైబర్ నేరగాళ్లకు తెలుసు. దీన్ని వారు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ విధంగా సైబర్ దాడులకు పాల్పడుతున్నారని 'మైక్రోసాఫ్ట్ ఇంటిలిజెన్స్' పరిశీలనలో తేలింది. రాన్సమ్వేర్ పంపడం, ఫిషింగ్ ఇ-మెయిల్స్తో వల వేయటం, ఇతర రకాల మాల్వేర్తో ఆకర్షించటం కనిపిస్తోంది. అలాంటి మెయిల్ను ఒకసారి క్లిక్ చేశామా... ఇక అంతే. మన అధికారిక మెయిల్ బాక్సుల్లోకి చొరబడి నానా విధ్వంసం సృష్టిస్తారు. వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారాన్ని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీ-వర్డ్స్ను దొంగిలిస్తారు. అందువల్ల సైబర్ భద్రత అత్యంత ముఖ్యమైన విషయం.
వీడియో/ ఆడియో సమావేశాలు తప్పనిసరి అవసరంగా మారాయి. వీటిల్లో పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి?
వీడియో లేదా ఆడియో సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తున్నారనేది ముఖ్యాంశం. ఈ సమావేశాల్లో ఎవరు పాల్గొనాలి, అందులో మాట్లాడేదెవరు, వినేదెవరు? అనేది ముందుగానే నిర్దేశించుకుని, దానికి తగ్గట్లుగా నియంత్రణలు పెట్టుకోవాలి. బయటి వ్యక్తులు ఇటువంటి సమావేశాల్లో చొరబడి రహస్య సమాచారాన్ని తస్కరించే అవకాశాలు ఉంటాయి. అటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలి. సంభాషణలను 'రికార్డు' చేస్తుంటే ఆ విషయాన్ని ముందుగానే అందులో పాల్గొంటున్న వారికి తెలియజేయాలి. రికార్డింగ్స్ ఫైల్స్ను 'ఎన్క్రిప్టెడ్ రిపాజిటరీ' లో భద్రంగా దాచాలి. ఆ ఫైల్స్ను కావాలసిన వారికే షేర్ చేసే పరిస్థితి ఉండాలి. దీని కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో పెట్టుకోవాలి.
'రిమోట్ వర్కింగ్' లో భాగంగా ఆన్లైన్ టూల్స్ వినియోగిస్తున్నప్పుడు ఎవరైనా మన వ్యక్తిగత, వృత్తి పరమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉంటుందా?