కరోనా వైరస్ రోగుల కోసం ఐసీయూ-గ్రేడ్ వెంటిలేటర్ను అభివృద్ధి చేసింది ఐఐటీ కాన్పూర్ ఆధ్వర్యంలోని స్టార్టప్ నోకా రోబోటిక్స్. దీని ధర విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వెంటిలేటర్లతో పోలిస్తే పదో వంతు ఉంటుందని వెల్లడించింది.
దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ వెంటిలేటర్లను ఈనెల చివరి నాటికి లేదా.. జూన్ మొదటి వారానికి డెలివరీ ప్రారంభిస్తామని తెలిపారు సంస్థ సహ వ్యవస్థాపకుడు అమితభ బంద్యోపధ్యాయ.
" దేశం కోసం లాభాపేక్ష లేని వెంటిలేటర్ల తయారీ కోసం ఐఐటీ కాన్పూర్, నోకా రోబోటిక్స్.. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్తో ఒప్పందం చేసుకున్నాయి. వీటి ధర ఒక్కోయూనిట్కు సుమారుగా రూ.1.5 లక్షలుగా ఉంటుందని ముందుగా అంచనా వేశాం. దిగుమతి చేసుకుంటున్న వెంటిలేటర్ల ధర రూ.8 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 25 లక్షల వరకు ఉంటోంది. జులై చివరి నాటికి 10వేల యూనిట్లు ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. డిమాండ్ ఎక్కువగా ఉంటే ఆగస్టు నాటికి 30వేల యూనిట్లకు పెంచుతాం."
– అమితభ బంద్యోపధ్యాయ
వైరస్ను చంపే ఫిల్టర్లు..ప్రత్యేకం
ఆరోగ్య సిబ్బంది భద్రత, రక్షణే తమ సంస్థ ప్రథమ ప్రాధాన్యంగా వైరస్ను చంపే ఫిల్టర్ ఛాంబర్తో వెంటిలేటర్ను రూపొందించినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కురెల్ తెలిపారు.
" కరోనా సోకిన వ్యక్తి వెంటిలేటర్పై శ్వాస తీసుకుంటున్నప్పుడు.. వైరస్తో నిండిన గాలిని బయటికి వదులుతాడు. ఐసీయూ మొత్తం వైరస్తో నిండిపోతుంది. అది వైద్య సిబ్బందికి చాలా ప్రమాదకరం. మా వెంటిలేటర్లో ఆల్ట్రావైలెట్ ఫిల్టర్ ఛాంబర్స్ను ఏర్పాటు చేశాం. అది వైరస్ను చంపి.. గాలిని శుభ్రపరుస్తుంది. దేశీయ అవసరాలు, కరోనా వైరస్ నుంచి ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకుని వెంటిలేటర్ రూపొందించేందుకు బోర్డులో డాక్టర్లు, వైద్య నిపుణులను చేర్చుకున్నాం. పెద్ద పెద్ద ఆస్పత్రులు ఎక్కువగా ఉపయోగించే 5-6 ఉన్నత స్థాయి వెంటిలేటర్లను పరిశీలించినప్పుడు వాటిలో ఫిల్టర్లు లేవని గుర్తించాం. మా వెంటిలేటర్లను ఐసీయూతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వినియోగించొచ్చు. "
– నిఖిల్ కురెల్, సహ వ్యవస్థాపకుడు.
నోకా రోబోటిక్స్ అభివృద్ధి చేసిన వెంటిలేటర్ను ఎక్కడికైనా తీసుకెళ్లేలా రూపొందించినట్లు తెలిపారు కురెల్. బ్యాటరీతో సుమారు 4 గంటల పాటు పని చేస్తుందని తెలిపారు. ఈ వెంటిలేటర్ల పనితీరును మే 12 నుంచి పుణెలోని ఆస్పత్రిలో పరీక్షించనున్నట్లు చెప్పారు కురెల్. వీటిపై యూఎల్, టీయూవీ పరీక్షలూ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.