సమాచార నియంత్రణ విషయమై ట్విటర్తో నెలకొన్న వివాదం నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై కొత్త నిబంధనల అమలుకు భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకుగాను 'మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నియమావళి'కి సంబంధించి ముసాయిదా తయారైనట్లు ఓ ప్రముఖ వార్తాసంస్థ తెలిపింది. అందులోని కీలకాంశాలను వెల్లడించింది. చట్టవిరుద్ధమైన లేదా తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు 2018 నుంచి ప్రభుత్వం కఠిన నిబంధనల రూపకల్పనకు యోచిస్తోంది. తాజాగా రైతుల ఆందోళనలకు సంబంధించిన సమాచారాన్ని తొలగించాలంటూ ఇచ్చిన ఆదేశాలను ట్విటర్ పట్టించుకోకపోవడం దీనికి ఆజ్యం పోసింది. కొత్త ముసాయిదా ప్రతిపాదనల ప్రకారం.. చట్టబద్ధమైన నిబంధనలు వర్తింపజేస్తారు.
- ఒక సమాచారాన్ని (కంటెంట్) తొలగించాల్సిందిగా ప్రభుత్వపరమైన లేదా చట్టబద్ధమైన ఆదేశాలిస్తే వీలయినంత త్వరగా 36 గంటలు దాటకుండా దాన్ని పాటించాల్సి ఉంటుంది.
- ఏదైనా దర్యాప్తు విషయం లేదా సైబర్ సంబంధిత సంఘటనలకు సంబంధించి అడిగిన మేరకు 72 గంటల్లోగా ఆయా సంస్థలు సహకారం అందించాల్సి ఉంటుంది.
- లైంగిక చర్యలు లేదా సంబంధిత అంశాలకు సంబంధించిన పోస్టులు ఉంటే వాటిపై ఫిర్యాదు అందిన రోజునే ఆ కంటెంట్ను తొలగించాల్సి ఉంటుంది.
- జాతి, మతపరమైన అంశాలకు సంబంధించిన కంటెంట్ను పరిశీలించేందుకు కంపెనీలు ఓ అధికారిని నియమించాల్సి ఉంటుంది. అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి ఓ అధికారిని నియమించాలి. వీరంతా భారత పౌరులే అయి ఉండాలి.