తెలంగాణ

telangana

ETV Bharat / business

జైట్లీ మృతి పట్ల పారిశ్రామిక దిగ్గజాల సంతాపం - సునీల్ మిత్తలు

అరుణ్​ జైట్లీ మరణం దేశానికి తీరని లోటని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. జైట్లీ మృతికి సంతాపం తెలుపుతూ.. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు పలు సంస్థల అధినేతలు.

అరుణ్​ జైట్లీ

By

Published : Aug 24, 2019, 5:45 PM IST

Updated : Sep 28, 2019, 3:22 AM IST

భాజపా సీనియర్​ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ మృతి పట్ల సంతాపం తెలిపారు పలువురు పారిశ్రామిక వేత్తలు. ఆర్థిక మంత్రిగా జైట్లీ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. జైట్లీని గొప్ప సంస్కరణకర్తగా, రాజనీతిజ్ఞుడిగా అభివర్ణించారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ దిల్లీ ఎయిమ్స్​లో చేరిన జైట్లీ.. పరిస్థితి విషమించి నేడు తుదిశ్వాస విడిచారు.

"జైట్లీ గొప్ప వక్త, పార్లమెంటరీయన్, ప్రజా పథకాల రూపకర్త. ప్రజలతో మమేకమై పని చేసే సామర్థ్యం ఆయన సొంతం. అభివృద్ధి పథంలో భారత్​ దూసుకెళ్లేందుకు ఆయనొక ఉత్ప్రేరకంగా పనిచేశారు." - గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్​ ఛైర్మన్

గౌతమ్ అదానీ ట్వీట్​

దేశం ఒక గొప్ప నాయకుడిని, న్యాయ కోవిదుడిని కోల్పోయిందని భారతీ ఎయిర్​టెల్​ ఛైర్మన్​ సునీల్ మిత్తల్​ పేర్కొన్నారు.

" జైట్లీ తీసుకునే నిర్ణయాలు చాలా మందిని ఆకర్షిస్తాయి. కొన్నిసార్లు ప్రత్యర్థి పార్టీలు సైతం సంక్లిష్ట పరిస్థితుల్లో ఆయన విధానాలనే అనుసరించేవి. అయన న్యాయ చతురత, సలహాలు కుటుంబ సమస్యల పరిష్కారానికి, వక్తిగత వ్యవహారాలన్నింటికీ ఉపయోగపడేవి. " - సునీల్​ మిత్తల్, భారతీ ఎయిర్​టెల్​ ఛైర్మన్​

" దృఢ నిశ్చయంతో తన జీవితాన్ని దేశంకోసం అంకితం చేసిన జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని నేను ప్రార్థిస్తున్నా. ఆయనకు నా సెల్యూట్​."
- ఆనంద్​ మహీంద్రా, మహీంద్రా గ్రూపు ఛైర్మన్

ఆనంద్​ మహీంద్రా ట్వీట్​

" దేశం గొప్ప మేధావిని కోల్పోయింది. జీఎస్టీ వంటి సంస్కరణలతో.. ఇటీవలి కాలంలో గొప్ప సంస్కరణకర్తగా ఆయన్ను దేశం కచ్చితంగా గుర్తుంచుకుంటుంది."
- దీపక్ పరేఖ్​, హెచ్​డీఎఫ్​సీ లిమిటెడ్ ఛైర్మన్

"జైట్లీ మరణం ఒక పార్టీకే కాదు, దేశానికీ తీరని లోటు. ఆయనకున్న రాజకీయ, న్యాయ, ఆర్థిక, అంతర్జాతీయ అనుభవాన్ని చూసి .. నేనెప్పుడూ ఆయన్ను దూరదృష్టి ఉన్న గొప్ప వ్యక్తిగా భావిస్తుండేవాడిని."

- అనిల్ అగర్వాల్, వేదాంత ఛైర్మన్

వీరితో పాటు పరిశ్రమల సమాఖ్య సీఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్, సీసీఐ అధ్యక్షుడు రాజీవ్ తల్వార్, అసోచామ్​ అధ్యక్షుడు బీకే గోయెంకా, జెఎస్​డబ్ల్యూ గ్రూప్​ సీఎండీ సజ్జన్ జిందాల్​ల సహా పలువురు ప్రముఖులు ట్విట్టర్​ ద్వారా సంతాపం తెలిపారు. పరిశ్రమల అభివృద్ధికి జైట్లీ చేసిన కృషిని కొనియాడారు.

ఇదీ చూడండి: విత్త మంత్రిగా జైట్లీ: జీఎస్టీ నుంచి బడ్జెట్​ 2.0 వరకు...

Last Updated : Sep 28, 2019, 3:22 AM IST

ABOUT THE AUTHOR

...view details