కరోనా మహమ్మారికి సంబంధించిన మోసాలను గుర్తించేందుకు గూగుల్ ఇండియా నూతన వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ వెబ్సైట్ను మరాఠీ, తమిళం, తెలుగు, బెంగాలీ వంటి ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది సంస్థ. ఆన్లైన్ ద్వారా ఎదురయ్యే సమస్యలు, మోసాల గురించి ఈ వెబ్సైట్ సమాచారం అందించి.. వినియోగదారులు సురక్షితంగా ఉండేందుకు సాయం చేస్తుందని తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా కొద్ది వారాలుగా కొవిడ్-19కు సంబంధించి రోజుకు 18 మిలియన్ల ఆన్లైన్ మోసాలు గుర్తించినట్లు గూగుల్ అధునాత యంత్ర అభ్యాస బృందం తెలిపింది. వాటికి అదనంగా మరో 240 మిలియన్ల మోసపూరిత సందేశాలు ఉన్నాయని చెప్పింది.
"గూగుల్ థ్రెట్ అనాలసిస్ బృందం హ్యాకింగ్ చర్యలపై నిరంతరం నిఘా పెట్టింది. ఈ నిఘా వ్యవస్థ కొత్త రకం మోసాలను గుర్తించింది. అందులో కరోనాపై పోరాడుతున్న ఎన్జీఓలు, ఛారిటీల మాదిరి ఈ-మెయిల్స్, ఇంట్లో నుంచి పని చేసే ఉద్యోగులకు సంస్థ కొత్త మార్గదర్శకాలు పంపించటం వంటివి ఉన్నాయి. కరోనాపై నిరంతరం సేవలందిస్తూ కృషి చేస్తున్న వైద్యులనూ మోసగిస్తున్న సందర్భాలు ఉన్నాయి. కొవిడ్-19కు సంబంధించిన మోసాలు ప్రధానంగా ఈ-మెయిల్స్ రూపంలోనే ఉంటున్నాయి. ఇంటి చిరునామా, బ్యాంకు వంటి వ్యక్తిగత వివరాల విషయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి."
– గూగుల్ ఇండియా