ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) మాజీ ఛైర్మన్ సంజీవ్ సింగ్ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)లో చేరారు. ఆయిల్ 2 కెమికల్స్(ఓ2సీ) వ్యాపారాల అధ్యక్షుడిగా సంజీవ్ సింగ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆర్ఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హితల్ ఆర్ మెస్వాని సంస్థ ఉద్యోగులకు పంపిన సర్కులర్లో పేర్కొన్నారు. ఓ2సీ వ్యాపార బృందంతో కలిసి సంజీవ్ సింగ్ పని చేయనున్నట్లు వెల్లడించారు.
చమురు వ్యాపారాల్లో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్కో సంస్థకు విక్రయించేందుకు రిలయన్స్ ప్రయత్నిస్తోంది. ఈ ఒప్పందాన్ని సులభతరం చేసేందుకు గ్రూప్ నుంచి ఓ2సీ వ్యాపారాలను ప్రత్యేక యూనిట్గా విభజించేందుకు ప్రయత్నిస్తోంది ఆర్ఐఎల్. ఈ నేపథ్యంలోనే ఓ2సీ విభాగంలోకి సంజీవ్ సింగ్ను తీసుకున్నట్లు తెలుస్తోంది.