దేశంలో కొన్ని రోజుల్లో పండుగ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఆన్లైన్ విక్రయాలు భారీగా జరుగుతాయి. ఇదే సమయంలో సైబర్ మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువే. ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో సైబర్ నేరాల భయాలను తొలగించేందుకు సైబర్ ఇన్సూరెన్స్ ఆఫర్ను ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్. బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి ఈ సైబర్ బీమా పాలసీ అందించనున్నట్లు వెల్లడించింది
'డిజిటల్ సురక్ష గ్రూప్ ఇన్సూరెన్స్' పేరుతో ఈ పాలసీని ఇవ్వనున్నట్లు తెలిపింది ఫ్లిప్కార్ట్. ఈ పాలసీ వివిధ రకాల ఆన్లైన్ మోసాలు, సైబర్ దాడులు, ఆన్లైన్ లావాదేవీలకు బీమా ఇవ్వనున్నట్లు పేర్కొంది.
ప్రీమియం ఛార్జీలు ఇలా..
వినియోగదారులు అత్యల్పంగా రూ.183 ప్రీమయంతో రూ.50 వేల వరకు బీమా పొందొచ్చు. రూ.312 ప్రీమియంతో రూ.లక్ష వరకు, రూ.561తో రూ.2 లక్షల వరకు.. బీమా పొందే వీలుంది. వీటన్నింటికి 12 నెలల గడువు ఉంటుంది. బీమా కవర్ను రూ.10 లక్షల వరకు పెంచుకునే అవకాశం కూడా ఉంది.