తెలంగాణ

telangana

ETV Bharat / business

'లాక్​డౌన్​ పొడిగిస్తే ఆకలి చావులు కరోనాను మించుతాయి' - Indian Lockdown comments

లాక్‌డౌన్‌ను మరింత పొడిగిస్తే కొవిడ్‌-19కు మించి దేశంలో ఆకలి మరణాలు సంభవించే ప్రమాదముందని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. పనిచేయగలిగే అవకాశం ఉన్న వారిని వీలైనంత త్వరగా ఉత్పత్తిలో భాగస్వామ్యం చేయడం మంచిదని సలహా ఇచ్చారు. బుధవారం నిర్వహించిన ఓ వెబినార్‌లో ఆయన ఈ మేరకు సలహా ఇచ్చారు.

Infosys Narayana Murthy
లాక్​డౌన్​ పొడిగిస్తే కొవిడ్​కు మించిన ఆకలి మరణాలు

By

Published : Apr 30, 2020, 11:23 PM IST

ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ స్థితిని ఇంకా పొడిగించడం ఎంతమాత్రం మంచిది కాదని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే జరిగితే ఆకలి మరణాలు కొవిడ్‌-19ను మించిపోతాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశంలో ఈ వైరస్‌ కారణంగా దేశంలో మరణిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు. దేశంలో ఏటా వేర్వేరు కారణాల వల్ల సుమారు 90 లక్షల మంది మరణిస్తున్నారని చెప్పారు. అందులో కాలుష్యం కారణంగానే నాలుగో వంతుమంది మృత్యువాత పడుతున్నారని తెలిపారు. అదే సమయంలో కరోనా వల్ల గత రెండు నెలల్లో వెయ్యిమంది మరణించారని, దీనిపట్ల అంతగా ఆందోళన అవసరం లేదన్నారు నారాయణ మూర్తి.

అంతిమ ప్రభావం వాటిపైనే

దేశంలో సుమారు 19 కోట్ల మంది అసంఘటిత, స్వయం ఉపాధి వల్ల ఉపాధి పొందుతున్నారని, లాక్‌డౌన్‌ పొడిగిస్తే వీరంతా జీవనాధారం కోల్పోయే ప్రమాదం ఉందని మూర్తి హెచ్చరించారు. వ్యాపారులు కూడా 15 నుంచి 20 శాతం ఆదాయం కోల్పోతారని చెప్పారు. దీనివల్ల అంతిమంగా ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు, జీఎస్‌టీ వసూళ్లపై ప్రభావం పడుతుందని చెప్పారు.

పరీక్షల సంఖ్య పెరిగితేనే

దేశంలో కొవిడ్‌-19 పరీక్షల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయన్నారు. భారత పారిశ్రామికవేత్తలు కూడా కరోనా వైరస్​ అడ్డుకట్ట వేసేందుకు పరీక్షలకు సంబంధించిన పరిశోధనలకు ముందుకు రావాలని కోరారు. భారతీయుల జన్యు పరిస్థితుల వల్ల యువతలో ఈ వైరస్‌ లక్షణాలు కనిపించడం లేదని, అలంటి వారి వల్ల మహమ్మారి వేరొకరికి వ్యాపించే అవకాశం ఉందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వైరస్‌తో కలిసి జీవించడం మన ముందున్న మార్గమని అంగీకరించక తప్పదన్నారు. కరోనాకు పూర్వమున్న పరిస్థితులను కొనసాగించాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఒక షిఫ్ట్​కు బదులు మూడు షిప్ట్‌ల్లో పనిచేసే సదుపాయం తీసుకురావాలని మూర్తి అన్నారు.

ఇదీ చదవండి:కేంద్రబ్యాంకుల్లో ఆర్​బీఐ టాప్​.. ఫాలోవర్లతో రికార్డు!

ABOUT THE AUTHOR

...view details