చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమీ మరో కొత్త మిడ్రేంజ్ ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. రెడ్మీ కే20 సాధించిన విజయంతో అదే శ్రేణిలో మరో ఫోన్ను రెడ్మీ కే30 పేరుతో విడుదల చేయనున్నట్లు పేర్కొంది. గతంలో ఈ ఫోన్ గురించి వచ్చిన అంచనాలకు అనుగుణంగానే.. రెండు సెల్ఫీ కెమెరాలతో (డ్యూయల్ పంచ్ హోల్ కెమెరా), డ్యూయల్ మోడ్ 5జీ సపోర్ట్తో అందుబాటులోకి రానున్నట్లు షియోమీ స్పష్టం చేసింది. ఈ రెండు ఫీచర్లతో వస్తున్న తొలి ఫోన్ ఇదే కావడం విశేషం.
ఈ ఫోన్ను వచ్చే నెల 10న చైనాలో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది షియోమీ సంస్థ.
అయితే టెక్ వార్తల సంస్థలు అంచనా వేస్తున్నట్లుగా రెడ్ మీ కే30 ప్రోను అదే రోజు విడుదల చేస్తుందా లేదా అనే విషయంపై షియోమీ స్పష్టతనివ్వలేదు. ఇప్పటి వరకు ఉన్న టెక్ వార్తా సంస్థ సమచారం ప్రకారం రెడ్మీ కే30 ప్రో వచ్చే ఏడాది తొలినాళ్లలో మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.
డ్యుయల్ మోడ్ 5జీ అంటే?
5జీ నెట్వర్క్ అనేది చాలా దేశాల్లో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అయితే చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి దేశాలు 5జీని విసృతం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. కొన్ని దేశాల్లో 5జీ కోసం 4జీ నెట్వర్క్ మౌలిక సదుపాయాల్లోనే మార్పులు చేశారు. దీన్ని 5జీ నాన్ స్టాండ్ అలోన్ యాక్సెస్ (5జీ ఎన్ఎస్ఏ) అని అంటారు. సాధారణ 5జీ నెట్వర్క్ను స్టాండ్ అలోన్ యాక్సెస్ (5జీఎస్ఏ) అంటారు. ఈ నేపథ్యంలో రెండు రకాల నెట్వర్క్లను వాడేందుకు వీలుగా రెడ్మీ కే30 మోడల్ను షియోమీ ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
భారత్కు రెడ్మీ కే30?
ఈ ఫోన్ భారత్లో ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయంపై షియోమీ స్పష్టతనివ్వలేదు. అయితే భారత్లో ఇప్పటి వరకు 5జీ నెట్వర్క్ దిశగా పెద్దగా అడుగులు పడటం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది తొలినాళ్లలో రెడ్మీ కే30 4జీ వెేరియంట్ను భారత్లో విడుదల చేసే అవకాశమున్నట్లు పలు టెక్ వార్తా సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ఇదీ చూడండి:గూగుల్ షాపింగ్ ఫీచర్లో మరో కొత్త టూల్