తెలంగాణ

telangana

By

Published : May 26, 2020, 3:38 PM IST

ETV Bharat / business

'ఇంటి నుంచి పని'తో ఆఫీస్​ స్థలం డిమాండ్​లో క్షీణత!

ఇంటి నుంచి పని (వర్క్​ ఫ్రమ్​ హోమ్​)తో కార్పొరేట్​ కార్యాలయ స్థల డిమాండ్​లో సుమారు 5-15 శాతం తగ్గుదల నమోదవుతుందని పేర్కొంటున్నారు పలువురు స్థిరాస్తి రంగ నిపుణులు. కానీ, డేటా గోప్యత, ఉత్పాదకత వంటి సవాళ్లు ఎదురైనప్పటికీ సంస్థలు తమ ప్రాముఖ్యతను కోల్పోవన్నారు. కొవిడ్​-19 తర్వాత అభివృద్ధి చెందుతున్న రంగాలు, కొత్త సంస్థల నుంచి కార్యాలయ స్థల డిమాండ్​ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

WFH to impact office space demand in short-term
ఇంటి నుంచి పనితో ఆఫీస్​ స్థల డిమాండ్​లో 15 శాతం క్షీణత!

కరోనా మహమ్మారి కారణంగా కార్పోరేట్​ సంస్థలు ఇంటి నుంచి పని (వర్క్​ ఫ్రమ్​ హోమ్​) విధానాన్ని అవలంబిస్తున్నాయి. కరోనా వైరస్​ కట్టడి, ఉద్యోగుల మధ్య భౌతిక దూరం పాటించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో కార్యాలయ స్థల డిమాండ్​ సుమారు 5-15 శాతం మేర తగ్గుతుందని స్థిరాస్తి రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ,​ డేటా గోప్యత, ఉత్పాదకత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ సంస్థలు తమ ప్రాముఖ్యతను కోల్పోవని పేర్కొన్నారు.

అయితే.. కొవిడ్​-19 తర్వాత అభివృద్ధి చెందుతున్న రంగాలు, కొత్త సంస్థల నుంచి కార్యాలయ స్థల డిమాండ్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

" ఇంటి నుంచి పని ద్వారా టీమ్​ వర్క్​, పనితీరు నిర్వహణ, ఉత్పాదకత, సృజనాత్మకత, డేటా గోప్యత, అపార్ట్​మెంట్​ పరిమాణాలు, ఆఫీస్​లో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ వంటి సవాళ్లు ఎదురవుతాయి. ఏదైమైనా కార్యాలయ డిమాండ్​పై సుమారు 5-15 శాతం ప్రభావం ఉంటుందని నమ్ముతున్నాం. ఆందోళన, ఒంటరితనం, ఒత్తిడి, నిరాశ కూడా ఇంటి నుంచి పని స్వీకరించడాన్ని ప్రభావితం చేస్తాయి."

– రమేశ్​ నాయర్​, జేఎల్​ఎల్​ ఇండియా సీఈఓ.

చిన్న నగరాల్లోనూ..

కరోనా మహమ్మారి అనంతరం ముందుకు వెళ్లేందుకు ఇంటి సమీపం నుంచి పని, కార్యాలయంలో పని, ఇంటి నుంచి పని వంటి మరిన్ని సూత్రాలను పాటించాల్సి వస్తుందన్నారు నైట్​ ఫ్రాంక్​ ఇండియా సీఎండీ శిశిర్​ బైజల్​.

"ఈ పరిస్థితి దీర్ఘకాలికంగా ఉంటే దేశంలోని 8 పెద్ద నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లోనూ కార్యాలయాల అభివృద్ధి అవసరం పెరుగుతుంది. ప్రత్యామ్నాయ పని ప్రదేశ వ్యూహంగా ఇంటి నుంచి పనిని యాజమాన్యాలు భావించవచ్చు. కొవిడ్​-19కు సరైన చికిత్స లభించే వరకు భౌతిక దూరం అనేది తప్పనిసరి. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు ఎక్కువ స్థలం అవసరమవుతుంది. కార్పోరేట్లు నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యంతో 2020లో కార్యాలయాల స్థల లీజ్​ తగ్గనుంది."

- శిశిర్​ బైజల్​, నైట్​ ఫ్రాంక్​ ఇండియా సీఎండీ

తాత్కాలికమే..

కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఇంటి నుంచి పనికే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. అయితే అది తాత్కాలికమేనని కుష్​మన్​, వేక్​ఫీల్డ్​ ఎండీ అన్షుల్​ జైన్​ పేర్కొన్నారు.

" ప్రస్తుత పరిస్థితి ఇంటి నుంచి పని చేయాలని ఒత్తిడి చేస్తోంది. ఎలాంటి అనుమానం లేకుండా మనమంతా పూర్తిస్థాయిలో పని చేస్తున్నాం. కానీ ఇది తాత్కాలికమేనని స్పష్టంగా తెలుస్తోంది. చాలా మంది ఉద్యోగులు తిరిగి కార్యాలయానికి వెళ్లేందుకే మొగ్గుచూపుతున్నారు. చాలా మందికి ఇంటి నుంచి పనిలో సరైన సౌకర్యాలు, పరిస్థితులు లేవు. పని సౌలభ్యం పెరుగుతుంది. కార్యాలయంలో జనసాంద్రత తగ్గుతుంది. కానీ అది ఆఫీస్​ డిమాండ్​పై ప్రతికూల ప్రభావాన్ని చూపదు." - అన్షుల్​ జైన్, వేక్​ ఫీల్డ్​ ఎండీ

12 నెలల పాటు..

ప్రస్తుత పరిస్థితులతో వాణిజ్య కార్యాలయ స్థలం డిమాండ్​పై ప్రభావం 6-12 నెలల పాటు ఉంటుందని పేర్కొన్నారు అపాక్​ సీఈఓ శ్రీనివాసరావ్​. ఇంటి నుంచి పని అనేది కేవలం వ్యాపార కోణం నుంచే కాదు సంస్థ మూలధనం, ఉద్యోగుల భద్రతను సూచిస్తోందని తెలిపారు.

భారతీయ స్థిరాస్తి రంగంలో కొద్ది సంవత్సరాలుగా డిమాండ్​లో తగ్గుదల నమోదవుతున్నప్పటికీ, కార్యాలయ మార్కెట్​ మంచి పనితీరును కనబరుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details