తెలంగాణ

telangana

లాక్​డౌన్​తో విమాన టికెట్లు రద్దు.. డబ్బులు తిరిగివ్వని సంస్థలు

లాక్​డౌన్​ పొడిగింపుతో ప్రయాణాల బుకింగ్​లను రద్దు చేస్తున్నాయి విమానయాన సంస్థలు. అయితే టికెట్​ డబ్బులను తిరిగి ఇవ్వకుండా.. తదుపరి ప్రయాణాలకు బుకింగ్ చేసుకునేటప్పుడు వాడుకోవాలని చెబుతున్నాయి.

By

Published : Apr 15, 2020, 7:10 AM IST

Published : Apr 15, 2020, 7:10 AM IST

airlines
విమాన టికెట్​ డబ్బులు లాక్​డౌన్​

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వరకు పొడిగించడం వల్ల ఆ తేదీ వరకు చేసుకున్న ప్రయాణాల బుకింగ్‌లను రద్దు చేసే పనిలో విమానయాన సంస్థలు ఉన్నాయి. టికెట్లను రద్దు చేసినా, డబ్బులు మాత్రం నగదు రూపేణా తిరిగి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నాయి.

ఆ డబ్బులను తమ వద్దే (క్రెడిట్‌ షెల్‌) అట్టేపెట్టుకుంటామని, తదుపరి ప్రయాణాలకు బుకింగ్‌ చేసుకునేటప్పుడు దానిని ప్రయాణికులు వాడుకోవచ్చని చెబుతున్నాయి. కొన్నేమో ఈ ఏడాది చివరకు.. మరికొన్ని ఏడాదికాలం వరకు బుకింగ్‌లకు ఈ డబ్బులను ఉపయోగించుకునే వీలును కల్పిస్తున్నాయి.

స్పైస్‌జెట్‌:మే 3 వరకు ప్రయాణాల కోసం ఎవరైతే టికెట్లు బుకింగ్‌ చేసుకున్నారో.. ఆ టికెట్లను రద్దు చేస్తున్నాం. టికెట్లు రద్దు చేశాక మీ డబ్బును మా వద్దే భద్రంగా అట్టేపెడుతాం. 2021 ఫిబ్రవరి 28 వరకు అదే ప్రయాణికుడు ఎప్పుడు కొత్తగా బుకింగ్‌ చేసుకోవాలనుకున్నా ఆ డబ్బులను ఉపయోగించుకోవచ్చు.

ఇండిగో:మే 3 వరకు అన్ని విమాన సర్వీసులు నిలిపివేస్తున్నాం. టికెట్ల బుకింగ్‌ రద్దు ప్రక్రియ కొనసాగుతోంది. పీఎన్‌ఆర్‌ రూపంలో మీ టికెటు డబ్బులు సురక్షితంగానే ఉంటాయి. టికెటు తేదీ నుంచి ఏడాది కాలంలో ఆ డబ్బులను ఎప్పుడైనా మీ తదుపరి ప్రయాణం కోసం ఉపయోగించుకోవచ్చు.

విస్తారా:మే 3వ తేదీ వరకు ప్రయాణాల కోసం కొనుగోలు చేసిన టికెట్లను రద్దు చేసి, బదులుగా 2020 డిసెంబరు 31 వరకు ఎప్పుడైనా టికెట్‌ను బుకింగ్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఒకవేళ అప్పుడు ఛార్జీలో ఏమైనా తేడా ఉంటే ఆ వ్యత్యాసాన్ని ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది.

గోఎయిర్‌:'ప్రొటెక్ట్‌ యువర్‌ పీఎన్‌ఆర్' పథకం 2020 మే 3 వరకు వర్తిస్తుంది. ఈ పథకానికి అర్హత పొందిన వినియోగదార్లకు వచ్చే ఏడాది మే 3 వరకు ఎలాంటి రుసుం చెల్లించకుండానే ప్రయాణ తేదీని మరో తేదీకి మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తాం.

ఇదీ చూడండి:'లాక్‌డౌన్‌ సరే.. మరి ఉద్దీపన చర్యలేవీ?'

ABOUT THE AUTHOR

...view details