తెలంగాణ

telangana

ETV Bharat / business

కియా: ఏటా 3 లక్షల కార్లు- ఆర్నెల్లకు ఓ మోడల్​

ఆంధ్రప్రదేశ్​లో ప్రభుత్వాలు మారినా తమకు పూర్తి సహకారం అందుతోందని కియా మోటార్స్​ ఇండియా సేల్స్​, మార్కెటింగ్​ అధిపతి మనోహర్​ భట్​ తెలిపారు. బెంగళూరులో కియా సెల్టోస్​ కారు ఆవిష్కరణలో పాల్గొన్న ఆయన ఈటీవీ భారత్​తో మాట్లాడారు. ఏటా 3 లక్షల కార్లు, ఆర్నెల్లకు ఓ మోడల్​ను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

By

Published : Aug 24, 2019, 7:11 PM IST

Updated : Sep 28, 2019, 3:39 AM IST

కియా

ఆంధ్రప్రదేశ్​ అనంతపురంలో తయారైన సెల్టోస్​ కారును బెంగళూరులో ఆవిష్కరించారు కియా మోటార్స్ ఇండియా​. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు కియా మోటార్స్​ ఇండియా సేల్స్​, మార్కెటింగ్​ అధిపతి మనోహర్​ భట్​. అనంతరపురంలో కర్మాగారం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంపై స్పందించారు.

మనోహర్​ భట్​, కియా సేల్స్​, మార్కెటింగ్​ అధిపతి

"భారత్​లో 1.1 బిలియన్​ డాలర్ల పెట్టుబడి పెట్టాం. ఏటా 3 లక్షల కార్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. భారత్​లో కియా వాటా 1000లో 30 వరకు ఉండే అవకాశం ఉంది. అదే చైనాలో 1000లో 100 కార్లు కియావే.

భారత్​లో ఆర్థిక వృద్ధి వేగంగా జరుగుతోంది. వాహన రంగంలో మందగమనం శాశ్వతం కాదు.

కర్మాగారం ప్రారంభించడానికి రవాణా, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలన్ని పరిగణనలోకి తీసుకున్నాం. అందుకే అనంతపురాన్ని ఎంపిక చేశాం. మాకు ఏ ప్రభుత్వంతోనూ ఇబ్బంది కలగలేదు. గత, ప్రస్తుత ప్రభుత్వాల నుంచి పూర్తిగా సహకారం లభించింది. అధికారులు వేగంగా స్పందించారు.

కియా ఎలక్ట్రానిక్​ వాహనాలకు అంతర్జాతీయ మార్కెట్​ ఉంది. ఒకసారి ఛార్జ్​ చేస్తే 450 కిలోమీటర్లు నడిచే కార్లు అమెరికా, కొరియా మార్కెట్లలో లభిస్తున్నాయి. దేశంలో డిమాండ్​ ఉండి.. అందుకు ప్రభుత్వ సహకారం లభిస్తే అనంతపురంలోనే వాటిని తయారు చేస్తాం.

ప్రతి ఆర్నెల్లకు కొత్త మోడల్​ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. ఇక్కడి కర్మాగారం నుంచి మొదటగా దేశీయ అవసరాలకే ఉత్పత్తి చేస్తున్నాం. తర్వాత అవకాశం ఉంటే దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తాం."

-మనోహర్​ భట్​, కియా సేల్స్​, మార్కెటింగ్​ అధిపతి

ఇదీ చూడండి: మార్కెట్​లోకి 'మేడిన్ ఆంధ్రా' కియా కారు

Last Updated : Sep 28, 2019, 3:39 AM IST

ABOUT THE AUTHOR

...view details