తెలంగాణ

telangana

ఆనంద్​, నారాయణ్​కు 2020- లీడర్​షిప్​ అవార్డు

మహీంద్రా గ్రూప్​ ఛైర్మన్​ ఆనంద్ మహీంద్రా, అడోబ్​ ఛైర్మన్​ శాంతను నారాయణ్​కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాది ప్రతిష్టాత్మక లీడర్​షిప్​ అవార్డులకు వీరిద్దరిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం(యూఎస్‌ఐఎస్‌పీఎఫ్).

By

Published : Aug 22, 2020, 1:51 PM IST

Published : Aug 22, 2020, 1:51 PM IST

Updated : Aug 22, 2020, 2:07 PM IST

Anand Mahindra, Shantanu Narayen to receive 2020 Leadership Awards from USISPF
ఆనంద్ మహీంద్రా, శాంతను నారాయణ్​కు 2020 లీడర్​షిప్​ అవార్డు

భారత దిగ్గజ వ్యాపారవేత్తలు మహీంద్రా గ్రూప్​ ఛైర్మన్​ ఆనంద్ మహీంద్రా, అడోబ్​ ఛైర్మన్​ శాంతను నారాయణ్​ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది లీడర్​షిప్​ అవార్డులకు వీరిద్దరిని ఎంపిక చేసినట్లు తెలిపింది అమెరికా-భారత్​ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం(యూఎస్‌ఐఎస్‌పీఎఫ్). ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చే దిశగా వీరు ప్రయత్నిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

ఆగస్టు 31 నుంచి "యూఎస్-ఇండియా వీక్: నావిగేటింగ్ న్యూ ఛాలెంజెస్" పేరుతో జరగనున్న మూడో వార్షిక నాయకత్వ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. వర్చువల్​గా జరగనున్న ఈ కార్యక్రమంలో యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ బోర్డు సభ్యులు, 21 మంది ఫార్చూన్​-500 సీఈఓలు, ఇరు దేశాల ప్రభుత్వాధికారులు పాల్గొననున్నారు. సెప్టెంబర్​ 3న కార్యక్రమం ముగియనుంది.

"యూఎస్​-ఇండియా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలపరిచే దిశగా పనిచేస్తున్న ఇద్దరు పారిశ్రామికవేత్తలకు 2020- లీడర్​షిప్​ అవార్డును ప్రకటించడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ, వ్యాపారాలు అనిశ్చితిలో ఉన్నప్పుడు వీరిద్దరూ నిలబెట్టేందుకు సామర్థ్యం మేరకు కృషి చేస్తున్నారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు సానుకూలంగా సాగడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు ఆనంద్​ మహీంద్రా. డిజిటల్ టెక్నాలజీలో శాంతను నారాయణ్​ మార్గదర్శకాలు కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడం, స్టార్టప్‌లపై ప్రభావం వల్ల ప్రభుత్వాలకు మేలు జరుగుతోంది. ఇది పౌర సమాజంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలకూ చాలా కీలకం" అని యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ ఛైర్మన్​ జాన్​ ఛాంబర్స్​ వెల్లడించారు.

ఈ సదస్సులో ఇరుప్రాంతాల మధ్య ద్వైపాక్షిక సహకారం మరింతగా పెంపొందించుకునే విషయంపై చర్చించనున్నారు. వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలు, వ్యూహాత్మక శక్తి సంబంధాలు, ప్రపంచ సరఫరా గొలుసులో భారతదేశ పాత్ర, ఫిన్‌టెక్​తో భాగస్వామ్యం, హెల్త్‌కేర్, టెక్నాలజీలో సహకారం, ఎఫ్​డీఐలను ఆకర్షించడానికి న్యాయమైన పన్ను పాలనను వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలిపింది యూఎస్‌ఐఎస్‌పీఎఫ్.

Last Updated : Aug 22, 2020, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details