తెలంగాణ

telangana

ఒక షిఫ్టు 12 గంటలు- ఎందుకంత వ్యతిరేకత?

పనివేళలు, పని ప్రదేశంలో పాటించాల్సిన నిబంధనల గురించి కొత్త ముసాయిదాను కేంద్ర కార్మిక శాఖ ఇటీవల విడుదల చేసింది. సుదీర్ఘ పనివేళలు, వలస కార్మికులకు సంబంధించిన వివరాలు పొందుపరచాల్సిన అవసరం లేకపోవటం, ఆరోగ్య పరీక్షలు, భద్రతకు సంబంధించి నియమ నిబంధనలు ఇందులో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని ప్రతిపక్షాలతో పాటు పలువురు విమర్శిస్తున్నారు. అవేంటి? ఎందుకింత వ్యతిరేకత?

By

Published : Nov 26, 2020, 7:38 PM IST

Published : Nov 26, 2020, 7:38 PM IST

What is new in occupation safety rules & why 12-hours shift opposed
ఒక షిప్టు 12 గంటలు.. ఎందుకంత వ్యతిరేకత?

దేశంలో కార్మిక రంగాన్ని వ్యవస్థీకృతం చేసే దిశగా 'వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020' ద్వారా ఉద్యోగుల పనికి సంబంధించి కేంద్ర ఉద్యోగ, కార్మిక శాఖ ముసాయిదా నియమ నిబంధనలను ప్రకటించింది. పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులను మెరుగుపరచటం సహా అనుమతులు ప్రక్రియను సులభతరం చేసే ఉద్దేశంలో వీటిని తీసుకొచ్చింది ప్రభుత్వం. అయితే కొన్ని నిబంధనలను రాజకీయ పార్టీలతో పాటు పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ ముసాయిదాలో ఉన్న కీలక ప్రతిపాదనలు, వాటిపై ఉన్న విమర్శలకు గల కారణాలను తెలుసుకుందాం.

ఇదీ చూడండి: 'అంచనాలను మించి పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థ'

ఈ ముసాయిదా నిబంధనలు ఎవరికి వర్తిస్తాయి?

డాక్ ఉద్యోగులు, భవన నిర్మాణ కార్మికులు, మైన్లలో పనిచేసే కార్మికులు, అంతర్రాష్ట్ర వలస కార్మికులు, ఒప్పంద కార్మికులు, వర్కింగ్ జర్నలిస్టులు, ఆడియో-విజువల్ ఉద్యోగులు, సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులకు సంబంధించి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితి విషయంలో ఈ ముసాయిదా నిబంధనలు వర్తిస్తాయి.

నిబంధనలు ఏంటి?

  • ప్రతి ఒక్క ఉద్యోగికి అపాయింట్​మెంట్ లేఖను అందించాలి. ఇది ఉద్యోగి హోదా, నైపుణ్యాల విభాగం, వేతనాలు, అధిక వేతనాలు/ఉన్నత స్థానం సాధించేందుకు ఉన్న పద్ధతి తదితర వివరాలతో నిర్ణీత ఫార్మాట్​లో ఉండాలి. నిబంధనలు అమల్లోకి వచ్చిన అనంతరం 3 నెలల్లో దీన్ని అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనల కారణంగా ఏ ఉద్యోగిని కూడా అపాయింట్​మెంట్​ లెటర్ లేకుండా నియమించుకోరాదు.
  • 45 ఏళ్లు నిండిన డాక్, మైన్, భవన, నిర్మాణ, ఫ్యాక్టరీ ఉద్యోగులకు ఆయా సంస్థలే ఉచితంగా వార్షిక వైద్య పరీక్షలు నిర్వహించాలి.
  • సులభతర వాణిజ్యం దిశగా ఒకే ఒక ఎలక్ట్రానిక్, లైసెన్స్, వార్షిక ఇంటిగ్రేటెడ్ రిటర్న్​ను సంస్థలు, కంపెనీలు పొందేందుకు ముసాయిదా నిబంధనలు అవకాశం కల్పించాయి.
  • కాంట్రాక్టు నియామకాల కోసం జాతీయ స్థాయి లైసెన్సింగ్ వ్యవస్థను ముసాయిదా నిబంధనలు ప్రతిపాదించాయి. కాంట్రాక్టు ఉద్యోగుల సప్లై, ఆ కార్యకలాపాల్లో ఉండే వారికి ఐదు సంవత్సరాలకు గడువుతో దేశవ్యాప్తంగా ఒకే లైసెన్స్ అందించనున్నట్లు కోడ్​లో పొందుపరిచింది ప్రభుత్వం. ప్రస్తుతం వర్క్ ఆర్డర్ ఆధారిత లైసెన్స్ విధానం అమల్లో ఉంది.
  • 500 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థల్లో భద్రతకు సంబంధించి కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. పనిప్రదేశంలో భద్రత, ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం సంస్థ యాజమాన్యానికి ఉద్యోగులు తెలిపేందుకు ఈ నిబంధన ఉపయోగపడుతుంది.
  • ప్రతి సంస్థలోనూ అన్ని రకాల పనులకు సంబంధించి మహిళా ఉద్యోగుల విషయంలో ఉదయం ఆరు గంటల కంటే ముందు, సాయంత్రం ఏడు తర్వాత పని గురించి నిబంధనలు పొందుపరిచారు.
  • ఓవర్ టైమ్​కు సంబంధించి కూడా నిబంధనలు మెరుగుపరిచారు. ముసాయిదా ప్రకారం 15 నుంచి 30 నిమిషాల మధ్య పనిని 30 నిమిషాలుగా పరిగణించనున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 30 నిమిషాల కంటే తక్కువ పనిచేసినట్లైతే ఓవర్ టైమ్​గా పరిగణించరు.

వివాదాలు ఏంటి?

దీర్ఘ పనివేళలు: ఒక షిప్టు గడువును 8-9 గంటల నుంచి 12 గంటల వరకు పెంచుకునే వెసులుబాటును ఈ ముసాయిదా కల్పించింది. అయితే వారంలో గరిష్ఠంగా 48 గంటలు మాత్రమే పనివేళలు ఉండాలన్న నిబంధన మాత్రం మారలేదు. 48 గంటల అనంతరం చేసిన పనిని.. ప్రస్తుతం ఉన్నట్లే ఓవర్ టైమ్​గా పరిగణించవచ్చు.

12 గంటల పాటు ఫ్యాక్టరీలలో పనిచేసినట్లైతే కార్మికుల ఆరోగ్యంతో పాటు కుటుంబంతో గడిపే సమయంపై తీవ్ర ప్రభావం పడుతుందని కాంగ్రెస్ పార్టీ అంటోంది. అంతేకాకుండా మూడో వంతు (దాదాపు 40.65 లక్షలు) మంది ఉద్యోగాలు కోల్పోతారని వాదిస్తోంది.

వలస కార్మికులు డేటా అందుబాటులో లేకపోవటం: అంతర్రాష్ట్ర వలస కార్మికుల విషయంలో ఎలాంటి నిబంధనలు లేకపోవటాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. వలస కార్మికుల సమాచారం ప్రజలకు అందుబాటులో లేదని ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ప్రకటించాక ఈ అంశంపై అందరి దృష్టి నెలకొంది.

ఆరోగ్య పరీక్షల నిబంధనలు అందరికీ వర్తించవు: కేవలం 45 ఏళ్ల దాటిన వారికే ఆరోగ్య పరీక్షలు చేయాలన్న దానిపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనివల్ల యువ ఉద్యోగులకు కంపెనీలు, సంస్థలు మొగ్గుచూపుతాయని, వయస్సు ఎక్కువున్న వారికి అవకాశాలు తగ్గిపోతాయని ఆయా పార్టీలు వాదిస్తున్నాయి.

భద్రతకు సంబంధించి కమిటీల ఏర్పాటు:500 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలకే ఈ నిబంధన వర్తించనుంది కాబట్టి తక్కువ మంది ఉద్యోగులున్న పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, వీటిలో భద్రతపై ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:పిల్లలతో పులి కేరింతలు- పర్యటకులు ఫిదా

ABOUT THE AUTHOR

...view details