తెలంగాణ

telangana

By

Published : May 29, 2021, 7:27 AM IST

ETV Bharat / business

Covaxin Vaccine: ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ నుంచి ముడి రసాయనాలు

కొవాగ్జిన్‌ టీకా ఉత్పత్తిలో వినియోగించే ముడి రసాయనాల (డ్రగ్‌ సబ్‌స్టాన్సెస్‌) తయారీకి హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ లిమిటెడ్‌ (ఐఐఎల్‌) సన్నద్ధమవుతోంది. జూన్‌ 15 నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు, జులై నెలాఖరు నాటికి ఈ ముడి రసాయనాలను భారత్‌ బయోటెక్‌కు అందించనున్నట్లు ఐఐఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వెల్లడించారు.

vaccine-crude-chemicals-from-indian-immunologicals
ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌ నుంచి ముడి రసాయనాలు

మనదేశంలో కొవిడ్‌-19(Covid-19) టీకాల ఉత్పత్తి పెంచడానికి ముడి రసాయనాల లభ్యత ప్రధాన సమస్యగా ఉంది. ముడి రసాయనాలను(Raw Chemicals) ప్రస్తుతం అమెరికా, ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఆయా దేశాల నుంచి తగినంతగా సరఫరా లేక టీకా ఉత్పత్తి పెంచలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి పరిష్కారంగా దేశీయంగానే ముడి రసాయనాలు ఉత్పత్తి చేయడంపై అటు పరిశ్రమ వర్గాలు, ఇటు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగంలోని నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (NDDB)కు అనుబంధ సంస్థగా ఉన్న ఇండియన్‌ ఇమ్యునలాజికల్స్‌, కొంతకాలం క్రితం భారత్‌ బయోటెక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం కొవాగ్జిన్‌ టీకా తయారీలో వినియోగించే ముడి రసాయనాలను హైదరాబాద్‌లోని తన యూనిట్లో ఉత్పత్తి చేసి, భారత్‌ బయోటెక్‌(Bharat Biotech)కు సరఫరా చేయనుంది. జూన్‌ 15 నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు, జులై నెలాఖరు నాటికి ఈ ముడి రసాయనాలను భారత్‌ బయోటెక్‌కు అందించనున్నట్లు ఐఐఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆనంద్‌ కుమార్‌ తెలిపారు.

బీఎస్‌ఎల్‌-3 యూనిట్‌ ఏర్పాటు:

నెలకు ఒక కోటి నుంచి కోటిన్నర డోసుల టీకా ఉత్పత్తికి అవసరమైన ముడి రసాయనాలను సరఫరా చేయాలనేది తమ ప్రణాళికగా ఆయన వెల్లడించారు. తొలిదశలో నెలకు 20 లక్షల నుంచి 30 లక్షల డోసుల టీకా ఉత్పత్తికి సరిపడే రసాయనాలు అందిస్తామని, నెమ్మదిగా దీన్ని నెలకు 60 లక్షల నుంచి 70 లక్షల డోసులకు పెంచుతామని అన్నారు. ఇందుకు హైదరాబాద్‌లోని తమ కరకపట్ల యూనిట్‌ను సిద్ధం చేసినట్లు వివరించారు. దీన్ని బయోసేఫ్టీ లెవల్‌- 3 (BSL-3) యూనిట్‌గా మారుస్తున్నామని, మరొక కొత్త ప్రొడక్షన్‌ బ్లాక్‌ నిర్మిస్తున్నట్లు ఆనంద్‌ కుమార్‌ తెలిపారు. ‘మిషన్‌ కొవిడ్‌ సురక్ష’ కింద టీకాల ఉత్పత్తి పెంచడానికి కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ శాఖ, వివిధ సంస్థలకు నిధులు సమకూర్చిన విషయం తెలిసిందే. ఇదేవిధంగా ఐఐఎల్‌కు సైతం రూ.60 కోట్ల గ్రాంటు విడుదల చేసింది. ఈ సొమ్ముతో ఐఐఎల్‌- కరకపట్ల యూనిట్లో మార్పులు చేర్పులు చేస్తున్నారు.

సొంత టీకాపై వచ్చే ఏడాదిలో మానవ ప్రయోగాలు

కొవాగ్జిన్‌ టీకాలో వినియోగించే ముడి రసాయనాలను సరఫరా చేయటమే కాకుండా, తనంతట తాను సొంతంగా కొవిడ్‌-19 టీకా ఆవిష్కరించేందుకు ఐఐఎల్‌ కృషి చేస్తోంది. కొవిడ్‌-19 లైవ్‌ వైరస్‌ ఆధారిత కొత్త టీకాను ఇప్పటికే రూపొందించినట్లు ఆనంద్‌ కుమార్‌ వెల్లడించారు. ప్రస్తుతం జంతువులపై ఈ టీకాను పరీక్షిస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాదిలో దీనిపై మానవ ప్రయోగాలు చేపట్టే అవకాశం ఉందని అన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్రవ్యాప్తంగా సూపర్‌ స్ప్రెడర్లకు స్పెషల్‌ వ్యాక్సినేషన్ డ్రైవ్‌

ABOUT THE AUTHOR

...view details