తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2020, 4:26 PM IST

ETV Bharat / business

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 'కరోనా మాంద్యం'!

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 140కి పైగా దేశాల్లో వ్యాపించిన ఈ వైరస్ కారణంగా దాదాపు అన్నిచోట్లా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో కూరుకుపోయే ప్రమాదం మెండుగా ఉందన్న విశ్లేషణలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలు సరైన ఉద్దీపన చర్యలు చేపట్టకపోతే కనీవినీ ఎరుగని మాంద్యాన్ని చవిచూడటం ఖాయమని చెబుతున్నాయి.

Trump Admin looks to send money directly to US citizens via cheques By Lalit K Jha
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 'కరోనా మాంద్యం'!

సర్వం బంద్​! పరిశ్రమల్లో ఉత్పత్తి లేదు. చేసేందుకు ఉద్యోగం లేదు. డబ్బులు ఉన్నా ఖర్చు చేసేందుకు అవకాశం లేదు. అసలు బయట తిరిగేందుకే వీలే లేదు. ఏ ఒక్క ప్రాంతంలోనో, ఏ ఒక్క సందర్భంలోనో నెలకొన్న పరిస్థితి కాదిది. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. చరిత్ర ఎరుగని ఇంతటి విపత్తుకు కారణం... కరోనా. ఆ ప్రమాదకర వైరస్​ దెబ్బకు అగ్రదేశాల్లోనే జనజీవనం స్తంభించిపోయింది. ప్రపంచ ప్రగతి రథం నిలిచిపోయింది.

ఇలా ఎంతకాలం? కరోనా వైరస్​ కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లిపోనుందా? ప్రపంచం కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని చవిచూడనుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిస్థితులు.

అక్కడ మొదలై...

అసలే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అంతంతమాత్రం. గతేడాది చివర్లో చైనాలో మొదలైన కరోనా మహమ్మారితో ఈ కష్టాలు మరింత పెరిగాయి. ప్రపంచ వాహన​ రంగానికి ఆయువు పట్టయిన వుహాన్​లో చాలా వరకు సంస్థలు మూతపడ్డాయి. కరోనా కేంద్రబిందువైన ఈ ప్రాంతంలోని ఎలక్ట్రానిక్​ సంస్థలు ఉత్పత్తులను నిలిపివేశాయి. మొబైల్ ఫోన్ల విడిభాగాల ఉత్పత్తితో పాటు ఎగుమతి ఒక్కసారిగా క్షీణించింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వాహన, స్మార్ట్​ఫోన్ల రంగాలు నేలచూపులు చూస్తున్నాయి.

కరోనా వ్యాప్తి అంతకంతకూ ఎక్కువవుతున్న కారణంగా భారత్​, అమెరికా, చైనా, ఇటలీ, రష్యా సహా పలు దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశాయి. క్యాసినోలు, హోటళ్లు, పార్కులు, సినిమా హాళ్లు, పబ్బులు ఇలా ఒక్కటేమిటి అన్నింటినీ మూసేశాయి. ఫలితంగా ఆయా రంగాల్లోని లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్​ అగమ్యగోచరమైంది.

డిమాండ్​ లేక ముడిచమురు ధరలూ క్షీణిస్తున్నాయి. ఫలితంగా చమురు మార్కెటింగ్​ సంస్థలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. విమానం, పర్యటకం, కార్పొరేట్​ రంగాలు ఊహించని నష్టాల ఊబిలో చిక్కుకున్నాయి. మరోవైపు క్రికెట్​, ఫుట్​బాల్​, బ్యాడ్మింటన్​, టెన్నిస్​ క్రీడల మెగా ఈవెంట్లతో పాటు ఈ ఏడాదిలో జరగాల్సిన టోక్యో ఒలింపింక్స్​ నిర్వహణ కూడా సందిగ్ధంలో పడింది. ​

కొవిడ్​-19 సంక్షోభంతో ప్రపంచదేశాల స్టాక్​ మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ, డౌజోన్స్​, నాస్​డాక్​, షాంఘై, నిక్కీ, సియోల్​, హాంగ్​సింగ్, మాస్కో ఎక్స్ఛేంజీ లాంటి స్టాక్​ మార్కెట్లు కనీవినీ ఎరుగని తిరోగమనం బాటపట్టాయి. ఫలితంగా ముకేశ్​ అంబానీ, మార్క్​ జూకర్​బర్గ్, లారీపేజ్​​ సహా పలువురు కుబేరుల సంపద రోజుల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది.

భారత వృద్ధిరేటు అంచనాలు తగ్గింపు..

ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ స్టాండర్డ్‌ అండ్‌ పూర్ (ఎస్‌ అండ్‌ పీ) 2020 ఏడాదికిగానూ భారత వృద్ధిరేటును 5.2శాతానికి తగ్గించింది. కొవిడ్‌-19 కారణంగా ఆసియా పసిఫిక్‌ దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకొనే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వృద్ధి రేటు అంచనాను 5.1శాతానికి తగ్గించింది ఫిచ్.

మూడీస్‌, ఆర్గనైజేషన్‌ ఆఫ్ ఎకనామిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఓఈసీడీ)లు కూడా ఇటీవల భారత్‌ వృద్ధిరేటు అంచనాను తగ్గించి 5.1శాతంగా లెక్కగట్టాయి.

అమెరికా- ఆర్థిక మాంద్యం

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా కూడా మాంద్యంలోకి ప్రవేశించే దశలో ఉందని హెచ్చరించింది ఎస్ అండ్ ​పీ గ్లోబల్​. గతంలో ఊహించినదాని కంటే అమెరికా, ఐరోపాలోని ఆర్థిక కార్యకలాపాలకు అధిక నష్టం జరగబోతోందని హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్‌లోనే 1 మిలియన్ ఉద్యోగాలను కోల్పోగలదని అంచనా వేసింది. ఇది పదేళ్ల క్రితం సంభవించిన మాంద్యం కంటే ఘోరమైనదిగా విశ్లేషించింది ఎస్​అండ్ ​పీ.

ఉద్దీపన చర్యలు వేగవంతం

కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతుండగా.. అమెరికా, బ్రిటన్‌, న్యూజిలాండ్​, భారత్​ సహా పలు దేశాలు నష్ట నివారణ చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే అమెరికా కేంద్ర బ్యాంక్ 'ఫెడరల్​ రిజర్వు బ్యాంకు​'​ కీలక వడ్డీరేట్లను పలుమార్లు తగ్గించగా.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉద్దీపన ప్యాకేజీ తీసుకొస్తోంది ట్రంప్‌ సర్కార్‌.

ఆర్థిక సంక్షోభం ప్రభావం పడిన అమెరికన్లకు కాస్త ఊరట కలిగించే దిశగా చర్యలు చేపడుతున్నారు ట్రంప్​. పెద్దలకు 1000 డాలర్లు, చిన్నారులకు 500 డాలర్ల ఆర్థిక సాయం నేరుగా అందించాలని భావిస్తున్నారు.

బ్రిటన్​ కూడా ప్యాకేజీ బాట పట్టింది. దేశీయ వ్యాపారాలతో పాటు ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు.. 33వేల కోట్ల పౌండ్ల మేర ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు ఆర్థిక మంత్రి రిషి సునక్‌.

న్యూజిలాండ్ కూడా అగ్రరాజ్యం అమెరికా బాటలోనే నడిచింది. కీలక వడ్డీ​ రేట్లను 0.25 శాతానికి తగ్గించింది.

మేము సైతం.. ఆర్​బీఐ

భారత ఆర్థిక వ్యవస్థపై కోవిడ్​-19 ప్రభావాన్ని తగ్గించి... మార్కెట్లు, సంస్థలు యథావిధిగా కార్యకలాపాలు సాగించేలా ఆర్బీఐ అన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని రిజర్వ్​ బ్యాంకు గవర్నర్​ శక్తికాంత దాస్​ తెలిపారు. బ్యాలెన్స్​ షీట్, అసెట్​ క్వాలిటీ, లిక్విడిటీపై కరోనా ప్రభావాన్ని అంచనా వేయాలని సూచించారు. వచ్చే ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నట్లు ఆర్బీఐ సంకేతాలిచ్చారు.

ప్రశ్నార్థకమే...

అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు..., మాంద్యం తప్పదన్న విశ్లేషణలు..., ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకుల ముందు జాగ్రత్త చర్యలు... ఆర్థిక వ్యవస్థ భవితవ్యంపై అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించి ప్రపంచ ప్రగతి రథం ఎలా, ఎప్పటికి ముందుకుసాగుతుందో చెప్పాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

ABOUT THE AUTHOR

...view details