ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం).. వాహనాల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. అన్ని సెగ్మెంట్లలోని వాహనాలపై 2 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని మంగళవారం తెలిపింది. వెల్ఫైర్ మోడల్కు మాత్రం ఇందుకు మినహాయింపునిచ్చింది. పెరిగిన ధరలు అక్టోబర్ 1 నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది టీకేఎం.
ముడి సరకు ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరగటం వల్ల.. వాహనాల ధరల పెంపు తప్పనిసరైందని టొయోటా పేర్కొంది. గత ఏడాది కాలంగా ఉక్కు, ఇతర విలువైన లోహాల ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్న విషయాన్ని గుర్తు చేసింది.
టొయోటా మాత్రమే కాదు..
అయితే వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన కంపెనీ టొయోటా ఒక్కటే కాదు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఈ నెల ఆరంభంలో పలు మోడళ్ల ధరను 1.9 శాతం మేర (Maruti Suzuki Price hike) పెంచింది. మారుతీ కార్ల ధరలను పెంచడం ఏడాది కాలంలోనే ఇది మూడోసారి.