పసిడి ధరలు పెరుగుతున్న కారణంగా.. పాత బంగారం మార్పిడి పెరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో దేశంలో 123.9 టన్నుల పసిడికే గిరాకీ లభించిందని, గతేడాది ఇదే కాల గిరాకీ 183.2 టన్నులతో పోలిస్తే, ఈసారి 32 శాతం క్షీణించిందని ప్రపంచ స్వర్ణ మండలి వివరించింది. ఇదే సమయంలో పుత్తడి దిగుమతులు 236.8 టన్నుల నుంచి 66 శాతం తగ్గి, 80.5 టన్నులకే పరిమితం అయ్యాయి. అధిక ధరలకు తోడు ఆర్థిక మందగమన ప్రభావమే ఇందుకు కారణమని విశ్లేషించింది. ఆభరణాల విక్రేతలు కూడా గతంలో దిగుమతి చేసుకుని, నిల్వ చేసుకున్న బంగారంతో పాటు పాత ఆభరణాల మార్పిడి (ఎక్స్ఛేంజ్)ని వినియోగించుకున్నారని తెలిపింది.
తొలి 9 నెలల్లో..
ఈ ఏడాది జనవరి-సెప్టెంబరులో 496.11 టన్నుల పసిడికి దేశీయంగా గిరాకీ లభించింది. 2018 ఇదే కాలంలో 523.9 టన్నులకు, ఆ ఏడాది మొత్తంమీద 760.4 టన్నుల పసిడికి గిరాకీ లభించిందని తెలిపింది.
ఇదే సమయంలో పసిడి దిగుమతులు కూడా 587.3 టన్నుల నుంచి 502.9 టన్నులకు తగ్గాయి. 2018 మొత్తంమీద దేశంలోకి 755.7 టన్నుల పసిడి దిగుమతైంది. ధరలు అధికంగా ఉన్నందున, పాత బంగారం మార్పిడి పెరిగింది. 2018 మొత్తంమీద 87 టన్నుల పాత బంగారం మార్చుకోగా, ఈ ఏడాది 9 నెలల్లోనే ఈ మొత్తం 90.5 టన్నులకు చేరింది.
అకస్మాత్తుగా ధర 20 శాతం పెరగడం వల్లే..
‘జూన్ నుంచి సెప్టెంబరు మధ్య బంగారం ధర అకస్మాత్తుగా 20 శాతం పెరగడం దేశీయంగా గిరాకీ తగ్గేందుకు ప్రధాన కారణమైంది. భారత్, చైనా సహా ప్రపంచదేశాలు ఆర్థిక మందగమనంలో చిక్కుకున్నందున, కొనుగోలుదారుల సెంటిమెంటు దెబ్బతినడమూ ప్రభావం చూపింది’ అని డబ్ల్యూజీసీ భారత మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం పేర్కొన్నారు. 2017 మార్చి త్రైమాసికం నుంచి దేశీయ గిరాకీ కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి. ఇలా పేరుకున్న బంగారం నిల్వలు 200-220 టన్నుల మేర ఉండొచ్చని, మందగమనం- అధిక ధరల నేపథ్యంలో, ఈ నిల్వలు తగ్గించుకునేందుకు వ్యాపారులు ప్రయత్నించారని తెలిపారు.