వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత మీడియా, వినోద(ఎమ్ అండ్ ఈ) రంగ ఆదాయాలు బాగుంటాయని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేస్తోంది. ఈ ఏడాదిలో 26 శాతం మేర క్షీణించిన ఈ రంగం 2021-22లో 27 శాతం మేర వృద్ధి చెంది రూ.1.37 లక్షల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకుంటుందని అంచనా వేసింది.
'టీవీలు' వేగంగా పుంజుకున్నాయ్
- డిజిటల్ మీడియా, టీవీ విభాగాలు కరోనా ముందు స్థాయిలకు చాలా తక్కువ సమయంలో చేరగా.. ప్రింట్, సినిమాలు, అవుట్డోర్, రేడియో వంటి వాటి వృద్ధికి సమయం పట్టొచ్చు.
- వ్యాపార ప్రకటనలు, వినియోగదారు చందా ఆదాయాలు మొత్తం ఎమ్ అండ్ ఈ రంగ ఆదాయంలో సమాన వాటా అందిస్తున్నాయి. వీటిపై కరోనా బాగా ప్రభావం చూపింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో వచ్చే ఏడాది వ్యాపార ప్రకటనల ఆదాయం 31%; చందా ఆదాయం 24 శాతం మేర వృద్ధి చెందవచ్చు.
- ఈ రంగ ఆదాయాల్లో సగం వాటా అందిస్తున్న టీవీ విభాగం పూర్తిగా రికవరీ అయింది. దీంతో 2021-22లో మంచి వృద్ధి నమోదు చేస్తుంది. తొలుత ప్రకటనల ఆదాయం తగ్గినా.. కొత్త కంటెంట్, ఐపీఎల్, పండుగల వంటి వాటి కారణంగా వేగంగానే పుంజుకుంది.
- చందాల విషయానికొస్తే కరోనా సమయంలోనూ చాలా మంది ఇంటికే పరిమితం కావడంతో టీవీ ఆదాయానికి ఢోకాలేకుండా పోయింది.
'ప్రింట్' వ్యూహాలు పనిచేశాయి
- ఎమ్ అండ్ ఈ రంగంలో అయిదో వంతు ఆదాయ వాటా ఉన్న ముద్రణ (ప్రింట్) విభాగం నెమ్మదిగా పుంజుకుంటోంది. 2021-22 చివరికి పూర్తి స్థాయిలో కోలుకోవచ్చు. డిజిటల్ విభాగానికి ఇది తన ఆదాయాన్ని కోల్పోతోంది. సంచికల (సర్క్యులేషన్) విషయానికొస్తే.. ముఖ్యంగా ఆంగ్ల భాషకు చెందిన ప్రింట్ విభాగం 8-10 శాతం మేర ఆదాయం కోల్పోయింది. మెట్రోల్లో ఇ-పేపర్లకు ఆదరణ లభించడం ఇందుకు నేపథ్యం. అయితే ప్రింట్ మీడియా కంపెనీలు తమ వ్యయాలను పునఃపరిశీలనతో చక్కదిద్దుకోవడంతో పాటు.. డిజిటల్ ఎడిషన్లు తేవడంతో మనగలిగాయి. వాటి వ్యూహాలు పనిచేశాయి.
ఓటీటీల వేగం పెరిగింది
కరోనా కారణంగా ఇంట్లోనే వినోదాన్ని అందించే ఓవర్ ద టాప్(ఓటీటీ) ప్లాట్ఫామ్లకు ఆదరణ పెరిగింది. ఆన్లైన్ గేమింగ్, ఇ-కామర్స్, ఇ-లెర్నింగ్, ఇ-పేపర్లు, ఆన్లైన్ వార్తా ప్లాట్ఫామ్స్లు కూడా రాణిస్తున్నాయి. మధ్యకాలానికి డిజిటల్ ఆదాయాలు ఏటా 14-16 శాతం మేర పెరగవచ్చని అంచనా. 2024 కల్లా మొత్తం ఎమ్ అండ్ ఈ రంగంలో వీటి ఆదాయాలు రెట్టింపై 20 శాతానికి చేరే అవకాశం ఉంది.