తెలంగాణ

telangana

By

Published : Feb 18, 2020, 11:09 PM IST

Updated : Mar 1, 2020, 7:05 PM IST

ETV Bharat / business

రైల్వే అక్రమ సాఫ్ట్​వేర్లకు చెక్-ఇక అందుబాటులో తత్కాల్!

అక్రమంగా తత్కాల్ టికెట్లను బుకింగ్ చేస్తున్న సాఫ్ట్​వేర్లపై రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. అక్రమ సాఫ్ట్​వేర్లు నిర్వహిస్తున్న 60 మంది ఏజెంట్లను రైల్వే రక్షణదళం అదుపులోకి తీసుకుంది. ఈ సాఫ్ట్​వేర్లను తొలగించే దిశగా నడుం బిగించింది. ఈ నేపథ్యంలో మరిన్ని తత్కాల్ టికెట్లు లభించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తత్కాల్ టికెట్లు అందుబాటులో ఉండే సమయం కూడా గణనీయంగా పెరగనున్నట్లు సమాచారం.

Tatkal tickets
తత్కాల్ టికెట్లు

తత్కాల్​ టికెట్ల జారీని అడ్డుకునే అక్రమ సాఫ్ట్​వేర్​లపై రైల్వే శాఖ ఉక్కుపాదం మోపింది. వాటిని నియంత్రిస్తున్న 60 మంది ఏజెంట్లను రైల్వే రక్షణ దళం(ఆర్​పీఎఫ్) అరెస్టు చేసింది. అక్రమ సాఫ్ట్​వేర్లకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న చర్యలతో ప్రయాణికులకు మరిన్ని తత్కాల్ టికెట్లు లభించనున్నాయి.

ఈ సాఫ్ట్​వేర్​లను తొలగించడం వల్ల ఇప్పటివరకు బుకింగ్ ప్రారంభమైన నిమిషాల్లోనే కనుమరుగవుతూ వస్తున్న తత్కాల్ టికెట్లు.. కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఆర్​పీఎఫ్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.

రైల్వే టికెట్ బుకింగ్ ప్రక్రియలో భాగంగా ఐఆర్​సీటీసీ లాగిన్, బ్యాంక్ ఓటీపీ వంటి స్టేజీలను ఈ అక్రమ సాఫ్ట్​వేర్​లు అధిగమించి టికెట్లు బుకింగ్ చేస్తున్నాయని.. సాధారణ ప్రయాణికులు మాత్రం ఈ ప్రక్రియను పూర్తిగా అనుసరించాల్సి వస్తోందని అధికారులు వ్యాఖ్యానించారు. సాధారణ ప్రయాణికులకు 2.55 నిమిషాల బుకింగ్ సమయం పడుతుండగా.. ఈ సాఫ్ట్​వేర్​లు ఉపయోగించిన వారికి 1.48 నిమిషాల్లోనే బుకింగ్ జరుగుతున్నట్లు చెప్పారు.

"గత రెండు నెలలుగా అక్రమ సాఫ్ట్​వేర్​ల ద్వారా ఒక్క తత్కాల్ టికెట్​ బుకింగ్ జరగలేదు. ఐఆర్​సీటీసీ వెబ్​సైట్​లో ఉన్న సమస్యలను పరిష్కరించాం. అక్రమ సాఫ్ట్​వేర్ల ఆపరేటర్లను పట్టుకున్నాం."-అరుణ్ కుమార్, ఆర్​పీఎఫ్ డీజీ

అక్రమ సాఫ్ట్​వేర్ల వ్యాపారం దాదాపు రూ.50 నుంచి రూ.100 కోట్ల మధ్య ఉన్నట్లు వెల్లడించారు అరుణ్. అరెస్టయిన వారిలో కోల్​కతాకు చెందిన ఓ వ్యక్తికి బంగ్లాదేశ్​ ఉగ్ర ముఠా 'జమాత్ ఉల్ ముజహిదీన్ బంగ్లాదేశ్​'తో సంబంధం ఉన్నట్లు వెల్లడించారు. మరో ఏడుగురికి కూడా ఈ ముఠాతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు.

10 గంటలపాటు తత్కాల్ టికెట్లు !

రైల్వే అధికారుల చర్యతో తత్కాల్ టికెట్లు కొన్ని గంటల పాటు అందుబాటులోకి వచ్చాయని అరుణ్ కుమార్ తెలిపారు. 2019 అక్టోబర్ 26న మగధ్ ఎక్స్​ప్రెస్​ తత్కాల్ బుకింగ్​లు కేవలం రెండు నిమిషాల్లోనే ముగిసిపోగా.. 2020 ఫిబ్రవరి 9న ఏకంగా 10 గంటలపాటు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా 2019 నవంబర్ 16న సంపూర్ణ క్రాంతి ఎక్స్​ప్రెస్​కు నాలుగు నిమిషాల్లోనే తత్కాల్ బుకింగ్​లు జరిగాయి. 2020 ఫిబ్రవరి 8న ఈ టికెట్లు 18 నిమిషాల పాటు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వివిధ జోన్ల పరిధిలోని టికెట్లను పరిశీలిస్తున్నట్లు అరుణ్ తెలిపారు. అక్రమంగా బుకింగ్​లు చేసే టికెట్ మానిటరింగ్ సాఫ్ట్​వేర్లపై దృష్టి సారించినట్లు వెల్లడించారు.

Last Updated : Mar 1, 2020, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details