తెలంగాణ

telangana

By

Published : Feb 24, 2022, 6:49 AM IST

Updated : Feb 24, 2022, 8:06 AM IST

ETV Bharat / business

షేర్లు కొంటే మర్నాడే డీ మ్యాట్‌ ఖాతాలో జమ

T plus 3 settlement: షేర్ల ట్రేడింగ్ పూర్తయిన మర్నాడే డీమ్యాట్‌ ఖాతాలో జమ చేసే విధానం ఈనెల 25 నుంచి దశలవారీగా అమల్లోకి రానుంది. ఈ పద్ధతిని మొదలు పెట్టేందుకు స్టాక్ ఎక్సేంజీలు, డిపాజిటరీలు సిద్ధమవుతున్నాయి.

t plus 3 settlement
డీ మ్యాట్‌ ఖాతా

T plus 3 settlement: షేర్ల ట్రేడింగ్‌ లావాదేవీ పూర్తయిన తర్వాత మర్నాడే (టీ+1) సెటిల్‌మెంట్‌ చేసే విధానం రేపటి (ఈనెల 25) నుంచి దశలవారీగా అమల్లోకి రానుంది. ఈ సెటిల్‌మెంట్‌ పద్ధతిని మొదలు పెట్టేందుకు స్టాక్‌ ఎక్స్ఛేంజీలు, క్లియరింగ్‌ కార్పొరేషన్‌లు, డిపాజిటరీలు సిద్ధమవుతున్నాయి.

సెటిల్‌మెంట్‌ అంటే.. షేరు కొనుగోలు అనంతరం (ఆర్డరు ఎగ్జిక్యూట్‌ అయ్యాక) డీమ్యాట్‌ ఖాతాలో జమ చేయడం.. లేదా షేరు విక్రయానంతరం డబ్బును బ్యాంకు ఖాతాలో వేయడం. గతంలో ట్రేడింగ్‌ పూర్తయ్యాక, ఆ రోజు నుంచి మూడు రోజులకు (టీ+3) సెటిల్‌మెంట్‌ అయ్యేది.

ఉదాహరణకు.. సోమవారం ఆర్డరు ఎగ్జిక్యూట్‌ అయితే గురువారం షేర్లు జమయ్యేవి. 2003 ఏప్రిల్‌లో దీనిని రెండు రోజులకు (టీ+2) కుదించారు. ఇప్పుడు ఒక రోజుకు పరిమితం చేసే ప్రక్రియ మొదలుకానుంది. టీ+1 పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు 2021 సెప్టెంబరు 7న స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సెబీ అనుమతినిచ్చింది.

తొలుత 100 కంపెనీలకు..

టీ+1 ప్రక్రియను తొలుత మార్కెట్‌ విలువపరంగా కింది నుంచి 100 స్థానాల్లో ఉన్న కంపెనీల షేర్లకు అమలు చేయనున్నారు. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లోని నమోదిత కంపెనీలన్నింటికీ ఈ విధానాన్ని వర్తింపజేయడం 2023 జనవరి 27 నాటికి పూర్తవుతుంది. మొత్తం 12 దశల్లో జరగనున్న ఈ ప్రక్రియ ద్వారా 2022 ఫిబ్రవరి నుంచి 2023 జనవరి వరకు 5,300 కంపెనీల షేర్లు స్వల్ప కాల సెటిల్‌మెంట్‌ విధానానికి మారుతాయి.

పెద్ద కంపెనీల షేర్లలో చాలా వాటికి 2023 జనవరిలో ఈ విధానం అమల్లోకి వస్తుంది. ఈ ఏడాది జులై 29 నాటికి బీఎస్‌ఈ నుంచి సుమారు 2,500 కంపెనీలు, ఎన్‌ఎస్‌ఈ నుంచి 285 కంపెనీల షేర్లు టీ+1కు మారతాయి. కీలక సూచీల్లోని చాలా కంపెనీల షేర్లకు, ఎక్స్ఛేంజీల్లో జరిగే ట్రేడింగ్‌ లావాదేవీ పరిమాణంలో సుమారు 90 శాతం వాటా ఉండే ప్రధాన కంపెనీల షేర్లకు వచ్చే ఏడాది జనవరి 27న దీనిని వర్తింపజేస్తారు.

నిర్ణయించారు ఇలా..

ఏయే కంపెనీల షేర్లకు ఈ విధానాన్ని ఎప్పటినుంచి అమల్లోకి తేవాలనే విషయాన్ని కొన్ని కీలక ప్రమాణాల ఆధారంగా నిర్ణయించారు. 2021 అక్టోబరు వరకు రోజువారీ మార్కెట్‌ విలువ సగటు ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. ఒకటికి మించి ఎక్స్ఛేంజీల్లో నమోదైన కంపెనీల షేర్లకు ఏ ఎక్స్ఛేంజీల్లో అధిక ట్రేడింగ్‌ లావాదేవీల పరిమాణం ఉంటుందో, అందులోని షేరు విలువను పరిగణనలోకి తీసుకుని మార్కెట్‌ విలువను లెక్కగట్టారు. ర్యాంకులపరంగా కింది నుంచి 100 స్థానాల్లో ఉన్న కంపెనీలకు ఫిబ్రవరి 25 నుంచి టీ+1 విధానం అమల్లోకి వస్తుంది.

2022 మార్చి నుంచి ప్రతి నెలా చివరి శుక్రవారం ట్రేడింగ్‌ రోజు, కింది నుంచి ఆ తర్వాతి 500 స్థానాల్లో ఉన్న షేర్లకు ఈ విధానం వర్తిస్తుంది. ఒకవేళ శుక్రవారం సెలవు రోజు అయితే తదుపరి ట్రేడింగ్‌ రోజును పరిగణనలోకి తీసుకుంటారు. అక్టోబరు తర్వాత నమోదైన కొత్త షేర్లను.. ట్రేడింగ్‌ ప్రారంభమైన తేదీ నుంచి 30 రోజుల వరకున్న సగటు ధర ఆధారంగా మార్కెట్‌ విలువను లెక్కించి జాబితాలో చేరుస్తారు.

ప్రిఫరెన్షియల్‌ షేర్లు, వారెంట్‌లు, రైట్‌ ఎన్‌టైటిల్‌మెంట్‌లు, పాక్షిక చెల్లింపు షేర్లు, డీవీఆర్‌ షేర్లకు కూడా మాతృ సంస్థ షేర్లతోటే టీ+1 విధానం అమలవుతుంది.

ఇదీ చూడండి:వర్క్​ఫ్రం ఆఫీస్​కు ఐటీ కంపెనీల సంసిద్ధత..

Last Updated : Feb 24, 2022, 8:06 AM IST

ABOUT THE AUTHOR

...view details