దేశంలో ఉక్కు ధరలు భారీగా పెరిగాయి. హాట్ రోల్డ్ కాయిల్(హెచ్ఆర్సీ) ఉక్కు టన్నుకు రూ.4 వేలు, కోల్డ్ రోల్డ్ కాయిల్(సీఆర్సీ) ఉక్కు రూ.4,900 వరకు పెంచినట్లు పరిశ్రమ వర్గాలు గురువారం వెల్లడించాయి. సవరించిన ధరల ప్రకారం.. టన్ను హెచ్ఆర్సీ స్టీల్ ధర రూ.70-71వేలు పలుకుతోంది. ఇక సీఆర్సీ ఉక్కు టన్నుకు రూ.83-84 వేల వరకు లభించనుంది.
హెచ్ఆర్సీ, సీఆర్సీ ఉక్కును వివిధ ఉపకరణాలతో పాటు.. ఆటో, నిర్మాణం వంటి పరిశ్రమలలో ఉపయోగిస్తారు. ఈ రంగాలకు ఉక్కు ప్రధాన ముడిసరుకు అయినందున.. వాహనాల ధరలు, వినియోగ వస్తువులు, ఇతర నిర్మాణ వ్యయాలు ప్రభావితం అవుతాయని నిపుణులు భావిస్తున్నారు.