దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంపై బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా రెండో దశ 'సునామీ'లా దేశాన్ని ముంచెత్తిందన్నారు.
కారణాలివే..
పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, మతపరమైన కార్యక్రమాల వల్ల కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తోందని చెప్పారు షా. ఎన్నికల వల్ల పట్టణాలతో పాటు, గ్రామీణ ప్రాంతాలకూ ఈ మహమ్మారి తీవ్రత వ్యాపించినట్లు తెలిపారు.
కేసుల్లో పెరుగుదల కారణంగా.. వైద్య మౌలిక సదుపాయాల డిమాండ్ అసాధారణంగా పెరిగిందని.. గ్లోబల్ వ్యాక్సిన్ ఈక్విటీపై వన్ షేర్ వరల్డ్ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పేర్కొన్నారు షా.
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజుకు 3-4 లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇంత భారీగా కేసులు వస్తున్న కారణంగా.. ఆస్పత్రుల్లో పడకలు, మెడికల్ ఆక్సిజన్ కొరత ఏర్పడింది.
అధిక జనాభా వల్ల సవాలు..
పెరిగిన కేసులకు తగ్గట్లు.. చికిత్స చేసేందుకు బెడ్లు, వైద్య సదుపాయాలు, వైద్య సిబ్బంది లేరని షా పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకూ తగినన్ని టీకాలు కూడా తమవద్ద లేవన్నారు షా. అధిక జనాభా ఉండటం వల్ల టీకా ప్రక్రియ సవాలుగా మారినట్లు వివరించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం భారత్కు సాయమందించేందుకు ముందుకు రావడాన్ని స్వాగతించారు షా.
ఏడాది ప్రారంభంలో అలా.. ఇప్పుడిలా..
ఇప్పటివరకు 40కి పైగా దేశాలు భారత్కు కొవిడ్ సహాయం కింద ఆక్సిజన్ సహా ఇతర పరికరాలు అందించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
'భారత్ సురక్షితంగా లేదు అంటే.. ప్రపంచం కూడా సురక్షితంగా లేదన్నట్టే.' అని షా పేర్కొన్నారు.
కరోనాను ఎదుర్కొనే విషయంలో ఈ ఏడాది ప్రారంభంలో భారత్ ఎంతో నమ్మకంగా ఉందని షా తెలిపారు. కరోనా రెండో దశ దేశాన్ని ముంచేత్తే ముందు వరకు వివిధ దేశాలకు కొవిడ్ టీకాలు విరాళంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు చెప్పారు.
ఇవీ చదవండి: