తెలంగాణ

telangana

ETV Bharat / business

'రుణ గ్రహీతలకు సుప్రీం మరింత ఉపశమనం'

రుణాలపై మారటోరియం పొడిగింపు, వడ్డీ మాఫీ విషయంలో కేంద్రం, ఆర్​బీఐ సమగ్ర వివరాలు రెండు వారాల్లోగా అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు రుణగ్రహీత ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా ప్రకటించకూడదని స్పష్టం చేసింది.

By

Published : Sep 10, 2020, 2:09 PM IST

SC to Centre
మారటోరియం

రుణ గ్రహీత ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా ప్రకటించకూడదని గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను పొడిగించింది సుప్రీంకోర్టు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీటిని అమలు చేయాలని కేంద్రానికి స్పష్టంచేసింది.

కరోనా నేపథ్యంలో రుణాలపై మారటోరియం పొడిగింపు, వడ్డీ మాఫీ అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది జస్టిస్ అశోక్ భూషణ్​ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం. అన్ని రంగాల రుణాలు, రుణగ్రహీతల అంశాలపై కేంద్రం, ఆర్బీఐ చర్చించి సమగ్రంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఇదే చివరి అవకాశం..

ఈ విషయంలో ఇదే చివరి అవకాశమని, మళ్లీ వాయిదాలు ఉండవని కేంద్రానికి స్పష్టం చేసింది ధర్మాసనం. రెండు వారాల లోపు అన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబర్​ 28కి వాయిదా వేసింది.

చర్చలు జరుపుతున్నాం..

ఈ విషయంలో బ్యాంకులు, ఇతర వాటాదారులతో చాలా చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ తరఫు న్యాయవాది, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. అత్యున్నత స్థాయిలో ఈ పరిశీలన జరుగుతోందని, మారటోరియం కాలంలో వడ్డీ విషయమై నిర్ణయం తీసుకునేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రుణగ్రహీతల గురించి అధికారులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

చర్యలు తీసుకోవద్దు..

విచారణ సందర్భంగా పిటిషన్​దారుల్లో ఒకరైన న్యాయవాది విశాల్ తివారీ.. పరిశ్రమలతో పాటు వ్యక్తిగత రుణగ్రహీతలకూ ఉపశమనం కల్పించాలని కోరారు. అంతేకాకుండా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు.. సిబిల్​ స్కోర్​ మార్పులు, బలవంతపు చర్యలు తీసుకోకూడదని అభ్యర్థించారు.

చక్రవడ్డీలు వసూలు చేస్తున్నారు..

ఇప్పటికీ రుణాలపై చక్రవడ్డీ వసూలు చేస్తున్నారని రుణగ్రహీతల తరఫు న్యాయవాది రాజీవ్​ దత్తా కోర్టుకు తెలిపారు. అనారోగ్యం కారణంగా చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, కొంతమందికి ఉద్యోగాలు పోగా మరికొంత మంది జీతాల్లో కోతలు పడుతున్నాయని వివరించారు. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలన్నారు దత్తా. మారటోరియం కొనసాగించి.. ఆ సమయంలో రుణాలపై వడ్డీని వసూలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఇదీ చూడండి:'అప్పుల ఖాతాలను నిరర్ధక ఆస్తుల కింద ప్రకటించవద్దు'

ABOUT THE AUTHOR

...view details