కరోనా మహమ్మారితో ఐటీ ఉద్యోగాల తీరు మారింది. సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించాయి. ఇదే సమయంలో కంపెనీలకు విదేశాల నుంచి వస్తున్న ప్రాజెక్టులూ పెరుగుతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇవి అధికంగా ఉండే అవకాశం ఉందనే అంచనాలున్నాయి. దీనికి తగ్గట్టే ప్రముఖ ఐటీ సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుత నిపుణులను అట్టేపెట్టుకునేందుకు బోనస్లు, వేతన పెంపును అమలు చేస్తున్నాయి.
కొవిడ్-19 తర్వాత వేగంగా కోలుకున్న రంగాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒకటి. దీనికి ప్రధాన కారణం.. అనేక సంస్థలు తమ వ్యాపారాలను డిజిటల్ రూపంలోకి మార్చేందుకు ప్రయత్నించడమే. దేశీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లాంటి సంస్థలు ఈ అవకాశాన్ని పూర్తిగా చేజిక్కించుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ సంస్థల ఆఫ్షోర్ ఆదాయాలు 5 శాతం వరకు వృద్ధి చెందే అవకాశాలున్నాయని అంచనా. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ఐదు సంస్థలూ కలిసి దాదాపు 1,50,000 మంది ఐటీ నిపుణులను నియమించుకుంటాయని కొన్ని సంస్థల అధ్యయనంలో తేలింది. 2012 తర్వాత ఇంత భారీ ఎత్తున నియామకాలు ఇప్పుడే జరుగుతున్నాయని అవి పేర్కొంటున్నాయి.
తక్కువ ఖర్చుతో పూర్తిచేయడంపై విదేశీ సంస్థల దృష్టి: కొవిడ్ వల్ల అమెరికాతో సహా పలు దేశాల్లో చాలా సంస్థలు గతేడాది మూతపడ్డాయి. అవన్నీ ఇప్పుడు తిరిగి తమ వ్యాపారాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. తక్కువ బడ్జెట్లోనూ డిజిటల్ కార్యకలాపాలు సాకారం చేసుకునేందుకు మూడోపార్టీ సేవలపై ఆధారపడుతున్నాయి. అందుకే, భారత్లోని సంస్థలపై అవి దృష్టి సారిస్తున్నాయి. తమ ప్రాజెక్టులను ఇక్కడి సంస్థలకు అప్పగిస్తున్నాయి. ఆఫ్షోర్ ప్రాజెక్టులు పెరగడానికి ఇది ప్రధాన కారణంగా ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు.
నిపుణుల లభ్యత